ఇందిర నుంచి రేవంత్ వరకు నిరూపించుకున్నారు కానీ…

rahul-gandhi-leadership

టీడీపీ, జనసేన, వైసీపీ, బీఆర్ఎస్‌, డీఎంకే వంటి పార్టీలు ఆయా పార్టీల అధినేతల సామర్థ్యంతో ఆటుపోట్లు తట్టుకొని నిలబడ్డాయి. ప్రాంతీయ పార్టీలలో నాయకుడి సమర్థతే చాలా కీలకం. కనుక నాయకుడు తప్పటడుగులు వేస్తే అధఃపాతాళానికి పడిపోతుంటాయి కూడా.

జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇదివరకు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల నాయకత్వంలో కాంగ్రెస్‌ దశాబ్దాలపాటు దేశాన్ని పాలించింది. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్‌పేయి, అద్వానీ, మోదీ, అమిత్ షా వంటి సమర్థులైన నాయకుల నాయకత్వంలో బీజేపీ దేశమంతటా విస్తరించింది.

ADVERTISEMENT

తెలంగాణలో కేసీఆర్‌ ధాటిని తట్టుకోలేక జాతీయ పార్టీ కాంగ్రెస్‌ విలవిల్లాడుతుంటే, రేవంత్ రెడ్డి ‘బాహుబలి’లా వచ్చి ఆదుకున్నారు. కనుక జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలకైనా బలమైన నాయకత్వం అవసరమని స్పష్టమవుతోంది.

దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నాయకత్వం లోపించినందునే 12 ఏళ్లుగా అధికారానికి దూరమైంది.

విశేషమేమిటంటే ‘ప్రధానమంత్రి’ పదవి తన ‘ప్రాథమిక హక్కు’గా భావిస్తున్న కాంగ్రెస్‌ యువనేత రాహుల్ గాంధీ, నేటికీ తన నాయకత్వ లక్షణాలతో ఆ పదవిని పొందగలననే నమ్మకాన్ని పార్టీ శ్రేణులకు, ప్రజలకు కల్పించలేకపోతున్నారు.

ఇంకా విచిత్రం ఏమిటంటే, నాయకత్వ లక్షణాలతో ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి పలువురు, దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్‌ నేతలు ‘రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ లక్ష్యం’ అని చెప్పుకుంటున్నారు.

ప్రధాని హోదాలో దేశాన్ని నడిపించాల్సిన వ్యక్తి తన స్వీయ శక్తి సామర్థ్యాలతో ఆ పదవిని సాధించుకోవాలి. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, ప్రధాని మోదీ లాగా.

కానీ దేశంలో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కలిసి రాహుల్ గాంధీని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలని కోరుకుంటున్నారు. అందుకు వారు గానీ, రాహుల్ గాంధీ గానీ సిగ్గుపడకపోవడం ఇంకా విచిత్రం.

కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వ లోపానికి తోడు, ఎన్నటికీ ఒంటరిగా ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి రాలేకపోవడం కూడా మరో శాపమే.

కనుక ఇండియా కూటమి మద్దతుతోనే ఎప్పటికైనా అవకాశం వస్తుందని తెలిసి ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌ నేతలు, వారి అధిష్ఠానం ఆలోచనా ధోరణి ఈ విధంగా సాగుతుండటం కూడా ఆ పార్టీకి శాపంగానే మారింది.

ADVERTISEMENT
Latest Stories