టాలీవుడ్ లో పలు క్లాసిక్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్న సీనియర్ నటి రాజశ్రీని ఓ దొంగ బురిడి కొట్టించాడు. రాజశ్రీ దృష్టిని మరల్చి 10 సవర్ల బంగారం, వజ్రాలు పొదిగిన నెక్లెస్ ను అపహరించాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ చోరీ మంగళవారం చెన్నైలోని టి.నగర్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళితే… చెన్నై టి.నగర్ లో నివాసముంటున్న రాజశ్రీ… మంగళవారం తన కుమారుడు శ్రీనివాసన్ తో కలిసి స్థానికంగా ఉన్న ఓ బ్యాంకుకు వెళ్లారు. సదరు బ్యాంకు లాకర్ లో భద్రపరచిన బంగారు, డైమండ్ నెక్లెస్ లతో పాటు విలువైన రోలెక్స్ వాచీని తీసుకుని బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఏటీఎంలో డబ్బు విత్ డ్రా చేసేందుకు శ్రీనివాసన్ వెళ్లగా, రాజశ్రీ కారులో కూర్చున్నారు.
ఆ సమయంలో కారు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి… రాజశ్రీని పలకరించి కరెన్సీ నోట్లు కింద పడి ఉన్నాయి, మీవేనేమో చూసుకోండంటూ ఆమెకు చెప్పాడు. అతడి మాటలు నిజమేనని నమ్మిన రాజశ్రీ కారు కిందకు దిగారు. ఇదే అదనుగా సదరు వ్యక్తి కారు లోపల సీటుపై ఉన్న నగలను అపహరించాడు. సదరు దొంగ చేతివాటాన్ని రాజశ్రీ గ్రహించేలోగానే అతడు పరారయ్యాడు. దీంతో షాక్ తిన్న రాజశ్రీ కుమారుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన నగల విలువ 10 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు.



