తాను శ్రీలంక వెళ్లి, అక్కడ ఇబ్బందులు పడుతున్న అసంఖ్యాక తమిళులతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని భావించానని…. తమిళ మత్స్యకారులపై జరుగుతున్న దాడుల గురించి సిరిసేనకు చెప్పాలని భావించానని… కానీ రాజకీయ కారణాలతో తన పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చిందని సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. లంక పర్యటనను రద్దు చేసుకున్న సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసారు.
అయితే భవిష్యత్తులో మరోసారి తనకు లంక వెళ్లి తమిళులను కలిసే అవకాశం దగ్గరైతే మాత్రం, రాజకీయ కారణాలతో తనను అడ్డుకోవద్దని రజనీ విజ్ఞప్తి చేశారు. వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, తమిళగ వాళ్వురిమై కట్చి అధ్యక్షుడు వేల్ మురుగన్ తదితరులు రాజకీయ కారణాలను చూపుతూ తనను ఆగిపోవాలని కోరారని, ఇష్టం లేకపోయినా, వారి విజ్ఞప్తి మేరకు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నానని అన్నారు.
సుదీర్ఘకాలం పాటు తమ భూమి, ఆత్మగౌరవం, హక్కుల కోసం రక్తం చిందించిన తమిళ త్యాగధనులు సంచరించిన ప్రాంతాల్లో తిరగాలన్న తన కోరిక తీరకుండా పోయిందని రజనీకాంత్ ఈ సందర్భంగా అభిప్రాయ పడ్డారు. శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతంలో తమిళుల కోసం “జ్ఞానం ఫౌండేషన్” నిర్మించిన 150 ఇళ్లను పంపిణీ చేయడానికి ఏప్రిల్ 9న రజనీ అక్కడకు వెళ్లాల్సి ఉండగా, తమిళ సంఘాల హెచ్చరికలతో వివాదాస్పదంగా మారడంతో, సూపర్ ఈ పర్యటన నుండి వైదొలిగారు.



