‘ఆరెంజ్’ ఫలితం తర్వాత మెగా ఫ్యామిలీకి అండగా ఉన్న మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తప్ప, ఇతర చిత్రాలను చేయని చెర్రీ, ఈ విమర్శలకు భయపడే ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా చేసి, మరోసారి క్లాస్ ఆడియన్స్ ను నిరుత్సాహపరిచారు. దీంతో ఇక, ఇప్పట్లో మరోసారి క్లాస్ జోలికి వెళ్ళారేమోనని భావించిన సినీ వర్గాలను షాక్ ఇచ్చే ‘బోల్డ్’ నిర్ణయం రామ్ చరణ్ తీసుకున్నారని సమాచారం.
ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ధ్రువ’ సినిమాను చేస్తున్న రామ్ చరణ్, ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్న విషయం తెలిసిందే. అయితే సుకుమార్ తర్వాత ప్రాజెక్ట్ ఎవరిది? అంటే దానికి సమాధానమే ఈ షాకింగ్ నిర్ణయం. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్రాలతో రెండు వరుస విజయాలు అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చెర్రీ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
మరో విశేషమేమిటంటే… అదేదో మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసి కాదు… ‘ఆరంజ్’ తర్వాత ప్రేమకధలను పట్టుకొని చెర్రీ, ఈ సినిమాతో మళ్ళీ ఓ ప్రేమకధా చిత్రంలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే రామ్ చరణ్ ఆలోచనల్లో పెను మార్పు వచ్చినట్లుగానే భావించవచ్చని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఒక విధంగా సుకుమార్ సినిమాను ఒప్పుకోవడమే ప్రత్యేకంగా చెప్పుకుంటున్న వారికి, ఇప్పుడు మేర్లపాక గాంధీ సినిమాను ఒప్పుకోవడం కూడా అవాక్కయ్యే విషయమే!



