మెగా అభిమానుల సమక్షంలో శిల్పకళావేదికలో మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ఒక్క పవన్ కళ్యాణ్ మినహా మిగతా మెగా హీరోలు, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నాలు, నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు వివి వినాయక్, సురేందర్ రెడ్డి తదితరులంతా హాజరై, తమ అభిప్రాయాలను అభిమానులతో పంచుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా పాటలకు నృత్యాలు ప్రదర్శిస్తూ అభిమానులను అలరించే ప్రయత్నమే ఎక్కువగా జరిగింది. ఇక చిరుపై మెగా హీరోలు ఒక్కొక్కరుగా పంచుకున్న భావాలను పరిశీలిస్తే…
రామ్ చరణ్…
ఎన్ని జన్మలెత్తినా అభిమానులకు రుణపడే ఉంటామని, మీ అభిమానాన్ని చూస్తుంటే ఒక్కోసారి చిరంజీవి కుటుంబ సభ్యులు మీరా? మేమా? అనిపిస్తుంటుంది. మా నాన్నపై మేము చూపించే ప్రేమకు మించి మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ గొప్పవి. మీ నుండి మేము ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాము. సినిమాలు ఒకసారి హిట్ అవొచ్చు, ప్లాప్ అవొచ్చు. కానీ, మీ అభిమానం మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అభిమానులను మేమెప్పుడూ కేర్ లెస్ గా చూడలేదు… అంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రసంగం చేసారు చెర్రీ.
అల్లు అర్జున్…
ప్రపంచంలో ఎంతో పెద్ద హీరోలు ఉండొచ్చు కానీ, ఏ హీరోకి ఇంత పెద్ద రేంజ్ లో ఫంక్షన్ చేసే ఫ్యాన్స్ ఉండరని, ఆ అదృష్టం కేవలం మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే ఉందని, గత ఏడాది చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నప్పటి నుంచి ఇప్పటివరకు తన మైండ్ లో ఇదే విషయం ఉందని, ఈ సందర్భంగా ప్రతి అభిమానికి తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని… బన్నీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి ‘ముఠా మేస్త్రి’ చిత్రంలోని ఓ డైలాగ్ ను అల్లు అర్జున్ చెప్పి ‘మెగా’ అభిమానులను ఆనందింపజేశాడు.
సాయిధరమ్ తేజ్ & వరుణ్ తేజ్…
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటే తమకు పండగతో సమానమని, ఈ రోజు కోసం ప్రతి సంవత్సరం వేచి చూస్తుంటామని సాయిధరమ్ తేజ్ అన్నారు. అలాగే పెదనాన్నకు తానూ చాలా పెద్ద అభిమానిని, ఎంత అంటే మీ కంటే కొంచెం ఎక్కువేమోనని తానూ భావిస్తున్నట్లుగా చెప్పిన మరో మెగా హీరో వరుణ్ తేజ్… ‘ఇంద్ర’ సినిమాలోని ‘కాశీకి వెళ్ళిపోయాడు…’ అనే డైలాగ్ ని చెప్పి అభిమానుల్లో జోష్ నింపాడు.



