‘పిచ్చోడి చేతిలో రాయి’ కాకూడదు!

Ram Gopal Varma make biopic NTRగడిచిన వారాంతంలో రాంగోపాల్ వర్మకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూను ప్రముఖ న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది. ముందుగా చెప్పినట్లే తన చివరి తెలుగు సినిమా ‘వంగవీటి’ మాత్రమేనని, మున్ముందు తెలుగు సినిమాలు చేయబోనని, బహుశా తను దర్శకత్వం వహించే సినిమాలు తెలుగులోకి డబ్ అవుతాయేమో, అది తన పరిధిలో లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అది ప్రసారమై మూన్నాళ్ళు కూడా కాలేదు గానీ, ఇంతలోనే వర్మ మాట తప్పిన మనిషిగా నిలిచారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితగాధతో తెరకెక్కనున్న సినిమాకు వర్మ దర్శకత్వం వహించబోతున్నారన్న ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమైంది. ఓ మంచి దర్శకుడి చేతిలో ఎన్టీఆర్ బయోపిక్ ను పెడతారని భావిస్తే, చివరికి ఇటీవల కాలంలో వితండ వాదనలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న వర్మ చేతిలోకి ఈ ప్రాజెక్ట్ వెళ్లడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సినిమా సినిమాకు వర్మ గ్రాఫ్ తగ్గిపోతుండడంతో, ఈ ప్రాజెక్ట్ కు న్యాయం చేస్తారన్న నమ్మకం అయితే ప్రేక్షకులలో కూడా లేదు. ఫైనల్ గా ఫ్యాన్స్ చెప్తున్న మాట ఏమిటంటే… పిచ్చోడి చేతిలో రాయిలా ఈ సినిమా కాకూడదు అంటున్నారు.

ADVERTISEMENT

తన చివరి చిత్రంగా ప్రకటించిన ‘వంగవీటి’ సినిమాను, విజయవాడలో నాడు జరిగిన వాస్తవాలకు విరుద్ధంగా వర్మ చిత్రీకరించారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యక్తమయ్యాయి. చివరికి అవే నిజమని నగర వాసులతో సహా, సినీ ప్రేక్షకులు కూడా తమ ఫలితం ద్వారా నిరూపించారు. మరి ఈ నేపధ్యంలో… ఎన్టీఆర్ బయోపిక్ ను అయినా చరిత్రను వక్రీకరించకుండా తీయగలరా? అన్నది అత్యంత ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే… ఎన్టీఆర్ కధ అంటే… అది ఒక మహా గ్రంధమే..! అందులో ఆటుపోటులు రెండూ ఉన్నాయి.

ఎన్టీఆర్ ఎంతలా కష్టపడి ఇండస్ట్రీలో పైకి వచ్చారు అనేది మొదటి పాయింట్ అయితే, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన పరిణామాలు కళ్ళకు కట్టినట్లు చూపించే దమ్ము, ధైర్యం వర్మకు ఉన్నాయా? ముఖ్యంగా వైశ్రాయ్ ఎపిసోడ్ ను ఎలా హ్యాండిల్ చేయగలరు? నాడు జరిగిన వాస్తవం ఏంటి? మీడియా వర్గాల్లో ఉన్న కధనాలు ఏంటి? ఎన్టీఆర్ ఎలా చనిపోయారు? లక్ష్మీపార్వతి ఏ పరిస్థితులలో ఎన్టీఆర్ దగ్గర చేరారు? అన్న రసవత్తరమైన సన్నివేశాలు ఎన్టీఆర్ జీవితంలో కోకొల్లలు.

గతంలో ‘రక్తచరిత్ర’ సినిమా మొదటి పార్ట్ లో కొంత వాస్తవికతను జోడించడంతో ప్రేక్షకులు పట్టం కట్టారు. అయితే రెండవ పార్ట్ లో రాజకీయ ఒత్తిళ్ళ వలన కొన్ని కీలక సన్నివేశాలు తీసివేసామని స్వయంగా వర్మ గారే ఒకానొక సందర్భంలో ప్రస్తావించారు. మరి లాంటి వర్మకు ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపి నుండి ఒత్తిడి రాదా? అలాగే వైసీపీలో ఉన్న లక్ష్మీ పార్వతి నుండి కూడా ఒత్తిడి రాకుండా ఉంటుందా? ఎందుకంటే… ఎన్టీఆర్ చివరి రోజుల్లో లక్ష్మీ పార్వతి ఎలా చేరువైందనే విషయం కధలో అత్యంత కీలకం కాబట్టి! అప్పుడే ఆమె నుండి కౌంటర్లు ప్రారంభమయ్యాయి కూడా!

ADVERTISEMENT
Latest Stories