దేశంలో ఎలాంటి సంచలన విషయం జరుగుతుందా… దాంతో ఓ కధ అల్లి సినిమా తీసేద్దామని ఆలోచనలు గావించే ‘క్రియేటివ్ కం వివాదాస్పద దర్శకుడు’ రాంగోపాల్ వర్మకు ప్రస్తుతం నయీమ్ కధ ‘విందు భోజనం’లా మారినట్లుంది. అందుకే ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు… మూడు సినిమాలు తీసేయాలని నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే వర్మ నుండి ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటనలు కూడా వెలువడ్డాయి. నయీమ్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేసి, మూడు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
“వివిధ వర్గాల నుంచి నయీమ్ కు సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించాను. కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగిన అతడి నేరాలు రోమాంచితంగా ఉన్నాయి. నక్సలైట్ నుంచి ఇన్ఫార్మర్, అక్కడ నుంచి గ్యాంగ్ స్టర్ గా రూపాంతరం చెందిన తీరు ఆసక్తిగొలిపేదే. ఆ తర్వాత అతడు నెంబర్ వన్ క్రిమినల్ గా మారిన తీరు భీతిగొలిపేదే. నయీమ్ స్టోరీ చాలా సంక్లిష్టంగా ఉంది. దీనిని ఒకే సినిమాలో చెప్పడం కష్టం. అందుకే నయీమ్ స్టోరీని మూడు భాగాలుగా చిత్రీకరించాలని నిర్ణయించా. రక్త చరిత్ర రెండు భాగాలుగానే వచ్చింది. నయీమ్ చిత్రం మాత్రం మూడు భాగాలుగా వస్తుంది” అని రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లతో హోరెత్తించారు.



