తెలుగు సినిమా దర్శకుల జాబితాలో రవిబాబు పేరు ఒక విలక్షణతను చాటుతుంది. సాంకేతిక పరిజ్ఞానం పరంగా హాలీవుడ్ రేంజ్ లో రవిబాబు సినిమాలున్నా, అవి ప్రేక్షకులను చేరువ కావడంలో మాత్రం ఎక్కడో గతి తప్పుతుంటాయి. అయితే రీచ్ అయితే మాత్రం అవి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ ఫలితాలనే అందుకుంటాయన్న విషయాన్ని రవిబాబు గత సినిమాలు చెప్పకనే చెబుతాయి.
త్వరలో పందిపిల్ల ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కిస్తున్న రవిబాబు, తన సినిమాలకు ఎలాంటి ఆడియో వేడుకలు గానీ, ఎలాంటి ప్రెస్ మీట్ లను గానీ ఏర్పాటు చేయరు. మరి దీనికి గల కారణాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్తూ… “ఎందుకు ఆడియో ఫంక్షన్లు… ఆడియో వేడుకలన్నీ సెల్ఫ్ డబ్బాలుగా మారిపోయాయ్… ఏవి అంటారు, వచ్చిన ప్రతి ఒక్కరి గురించి అలా వీడియోలు ప్లే చేసుకుంటూ పోతుంటారు…” అంటూ సమాధానం ఇచ్చారు.
వినడానికి కాస్త కర్ణకఠోరంగా ఉన్నప్పటికీ, రవిబాబు చెప్పింది అక్షర సత్యం. నిజంగా ప్రస్తుతం ఆడియో వేడుకలను చూడాలంటే ప్రేక్షకులకు సహనం మిక్కిలి అవసరం. అలాగే విచ్చేసిన ఆహ్వానితులు ఆయా హీరోలపై పొగిడే ప్రశంసలకు ‘ఆడియన్స్ తలలు పట్టుకోవడం ఒక్కటే మిగిలి ఉంటుంది’ అన్న రీతిలో పొగడ్తల అగడ్తలు సాగుతుంటాయి. మరో విశేషం ఏమిటంటే… సంగీత దర్శకుడ్ని వదిలేసి, హీరో, దర్శకుడు, నిర్మాత వంటి వారిని పొగిడిన ఆడియో వేడుకలకు కొదవే లేదు.
ఇందుకు ఆ హీరో, ఈ హీరో అన్న మినహాయింపే లేదు. అందుకే వీటికి అతీతంగా దర్శకుడు రవిబాబు తన సినిమాలకు ఆడియో వేడుకలు నిర్వహించకుండా తన ప్రత్యేకతను చాటుకోవడంతో పాటు, ప్రేక్షకులకు సమయం వృధా కాకుండా చూసుకుంటున్నారు. అయినా సినిమాలో విషయం ఉండాలే గానీ, ఆడియో వేడుకలు చేసే మేలు కన్నా కీడే ఎక్కువని ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ వంటి సినిమాల ఫలితాలు నిరూపించాయి.



