తుని సంఘటనలో నిందితులుగా తేలిన 13 మంది సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన నేపధ్యంలో నిరాహార దీక్షకు దిగిన కాపు నేత ముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలిపేందుకు ఇటీవల కాలంలో దాసరి నారాయణరావు, చిరంజీవి, పల్లం రాజు, బొత్స సత్యనారాయణల వంటి వారు రెండు సార్లు సమావేశమై చర్చలు జరిపారు. ముద్రగడ చేస్తున్న డిమాండ్లు సబబైనవని, వాటిని తక్షణం అమలు చేసి ప్రభుత్వం చిత్తశుద్ది చాటుకోవాలని… కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే మరికొన్ని వ్యాఖ్యలను చేసారు.
ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే తెరవెనుక మరొక ప్రధాన అంశం చర్చించారని మీడియా వర్గాల వేదికగా ప్రచారం జరుగుతోంది. ముద్రగడ విషయంతో పాటు కాపులకంటూ ప్రత్యేకంగా ఒక మీడియా ఛానల్ ను ఏర్పాటు చేయాలని ‘చిరు అండ్ కో’ భావిస్తున్నారని, 2019 ఎన్నికలలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా, కాపుల ఓట్లు కీలకం కానున్నాయని, దానికి సంబంధించిన కసరత్తులు ఇప్పటినుండే ప్రారంభించేందుకు ముందుగా ఒక మీడియా ఛానల్ ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.
అయితే ఒక కొత్త ఛానల్ ను ఏర్పాటు చేయాలా? లేక ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్నటువంటి ఛానల్ ను తీసుకుని పేరు మార్పుతో రన్ చేయాలా అన్నది కూడా చర్చలు జరిగినట్లుగా టాక్. వీరికి ఇంతటి స్ఫూర్తినిచ్చింది కూడా జగన్ కు చెందిన మీడియాగా చెప్తున్నారు. ఒక్క మీడియా ఛానల్ ను అడ్డం పెట్టుకుని, జగన్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెడుతున్నారో గమనించిన ‘చిరు అండ్ కో’కు మీడియా ప్రాధాన్యత తెలిసి రావడం వలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
ఇందులో వాస్తవాలు ఎన్ని ఉన్నాయో భవిష్యత్తే నిర్ణయిస్తుంది గానీ, ఇప్పటికే కుల రాజకీయాలు చేస్తున్నారని ప్రజల చీదరింపుకు గురవుతున్న ‘చిరు అండ్ కో’ వర్గం నిజంగా మీడియా ఛానల్ పెడితే, ప్రజానీకం ఆదరిస్తుందా? అన్నది ప్రశ్నార్ధకమే! ఇదీ గాక, జగన్ కు చెందిన ఛానల్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంటుందన్న వార్తలతో ప్రత్యామ్నాయంగా మరొక వేదిక ఉండడానికి కూడా ఇప్పటి నుండే కసరత్తులు జరుగుతున్నాయని మరో టాక్. ఏది ఏమైనా “టార్గెట్ టిడిపి” అన్న విషయాన్ని ‘చిరు అండ్ కో’ మరియు ‘జగన్ అండ్ కో’ స్పష్టం చేస్తున్నాయి.



