అప్పుడెప్పుడూ 500 రూపాయలకే మొబైల్ ఫోన్ అంటూ రిలయన్స్ సృష్టించిన హంగామా గుర్తుందా..! మళ్ళీ అలాంటి రోజులే రాబోతున్నాయి. అయితే ఈ సారి ఏకంగా 4జీ అప్ డేటెడ్ వర్షన్ తో కలిపి వినియోగదారులను పలకరించనున్నాయి. ఇప్పటికే ఉచిత వాయిస్, డేటా సేవలంటూ, ప్రత్యర్థి టెలికం కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన రిలయన్స్ జియో, తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది.
4జీ తరంగాల సాయంతో పని చేసే ‘ఫీచర్ ఫోన్’ను కేవలం 500 రూపాయలకే ఇవ్వాలని నిర్ణయించింది. వాస్తవానికి ఈ ఫోన్ ధరను 1000 – 1500 మధ్య ఫిక్స్ చేస్తారని మార్కెట్ వర్గాలు భావించగా, వారందరికీ షాక్ నిస్తూ, దిగువ తరగతి మార్కెట్ పై కన్నేసిన ముఖేష్ అంబానీ, 500కే అందించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ బ్రోకరేజ్, ఆర్థిక సేవల సంస్థ హెచ్ఎస్బీసీ తెలిపింది.
ఈ నెల 21వ తేదీన జరిగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చినట్టు తెలిపింది. ఇదే సమయంలో ఈ నెలతో ముగియనున్న ధనా ధనా ధన్ ఆఫర్ స్థానంలో మరో ఆకర్షణీయ టారిఫ్ ప్లాన్, ఆయన నోటి వెంట రానుందని పేర్కొంది. ప్రస్తుతం 2జీ ఫోన్లను వాడుతున్న మార్కెట్ ను 4జీ వైపు కదిలించడమే లక్ష్యంగా కనపడుతోంది.



