తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సిఎం కేసీఆర్ గురించి ఓ సంచలన విషయం బయటపెట్టారు. “కేసీఆర్ మళ్ళీ తానే ముఖ్యమంత్రి అవుతాననే నమ్మకంతో తన కాన్వాయ్ కోసం ఒక్కోటి రూ.3 కోట్లు విలువగల 22 లాండ్ క్రూయిజర్ వాహనాలను కొని విజయవాడలో దాచిపెట్టారు.
నేను ముఖ్యమంత్రి అయిన నా కాన్వాయ్ కోసం మళ్ళీ కొత్త కార్లు కొనడం దేనికని పాతవాటికే మరమత్తులు చేసి వాడుకొందామని అధికారులకు చెప్పాను. కానీ వారిలో ఒకరు కేసీఆర్ 22 కార్లు కొని విజయవాడలో దాచిపెట్టారనే విషయం నాకు చెప్పారు.
పాపం… ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తాను, తన బంధుగణం ఆ కార్లలో దర్జాగా తిరగవచ్చని ముందే కొని విజయవాడలో దాచిపెట్టారు కానీ ఆయన దరిద్రం కొద్దీ ఓడిపోవడంతో ఇప్పుడు ఆ కార్లు వాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి సంపద సృష్టించి ప్రజలకు పంచిపెడుతున్నామని హరీష్ రావు, కేటీఆర్ శాసనసభలో ఒకటే దంచారు. కానీ కేసీఆర్ కుటుంబమే తెలంగాణ ప్రజలను దోచుకొని విలాసవంతంగా జీవిస్తోందని ఇది నిరూపిస్తోంది. కేసీఆర్ కుటుంబం తింటున్నది ప్రజల కష్టారితంతో కట్టిన రక్తపు కూడే.
ప్రజాధనంతో కొన్న ఆ కార్లనీ తెలంగాణ ప్రభుత్వానికి చెందినవే కనుక త్వరలో వాటన్నిటినీ హైదరాబాద్కు రప్పించి ప్రజల ముందుంచుతాము,” అని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
కేసీఆర్కి ఇదివరకే కాన్వాయ్ ఉంది. కానీ కోట్లు ఖరీదైన ఆ కార్లన్నీ పక్కన పడేసి మళ్ళీ 22 కార్లు కొన్నారు. వాటిని తెలంగాణలో ఉంచకుండా విజయవాడలో ఎందుకు దాచారో?ఎవరి దగ్గర దాచిపెట్టారో?అనే చర్చ మొదలయ్యేలోగా బిఆర్ఎస్ నేత క్రిశాంక్ ఘాటుగా జవాబిస్తూ వాటి గురించి 2022, జూలై 24వ తేదీన ది హిందూ పత్రికలో వచ్చిన వార్తను ట్యాగ్ చేశారు.
ది హిందూలో వచ్చిన వార్త సారాంశం: “సిఎంగా కేసీఆర్ కాన్వాయ్లో ఉపయోగిస్తున్న 10 ఫార్ట్యూన్లకు అదనంగా మరికొన్ని ల్యాండ్ క్రూజర్ వాహనాలు హైదరాబాద్ నుంచి కార్గో విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకొన్నాయి. వాటిని విజయవాడ సమీపంలోని వీరపనేనిగూడెం వద్ద గల వర్క్ షాపుకు తరలించారు. అక్కడ వాటన్నిటినీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చబోతున్నారు. వాటితో కేసీఆర్ పర్యటనల కోసం రెండు బస్సులను కూడా బుల్లెట్ ప్రూఫ్ చేసేందుకు వచ్చాయి.”




