ఏపీ తెలంగాణలు రెండు రాష్ట్రాలుగా విడిపోయి పదేళ్ళవుతునప్పటికీ, వాటి మద్య రాజకీయ బంధాలు నేటికీ విడిపడటం లేదు. కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఉప్పూ నిప్పూలా ఉండేవారు కనుక విభజన సమస్యలు పరిష్కరించుకోలేకపోయారనుకున్నా, కేసీఆర్-జగన్ మద్య బలమైన చాలా బంధం ఉన్నప్పటికీ వారు ఎందుకు పరిష్కరించుకోలేదో తెలీదు.
విభజన సమస్యలను పరిష్కరించుకోనప్పటికీ అవసరమైనప్పుడు ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటారు. తమ వ్యక్తిగత అవసరాలు, పార్టీల రాజకీయ అవసరాల కోసం తమ రాష్ట్రాల ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు కూడా ఇద్దరూ వెనకాడరని సాక్షాత్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న శాసనసభలో చెప్పారు.
కేసీఆర్ చిత్తూరు వెళ్ళి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని ఆశీర్వదించి వస్తారని, ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ ఇంటికి వెళ్ళి వస్తుంటారని రేవంత్ రెడ్డి అన్నారు.
అలాగే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ ఆయనకు విందు భోజనం వడ్డించి మరీ రాయలసీమకు కృష్ణా జలాలు తరలించుకుపోయేందుకు సహకరించారని, ఆ విందులోనే సీమలో ఎత్తిపోతల పధకానికి పునాది రాయి పడిందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి తన పోలీసులను నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించి ప్రాజెక్టుని ఆక్రమించుకుని, దొంగతనంగా నీళ్ళు తీసుకుపోయారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పల్లెత్తు మాట అనలేదని, కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కేసీఆర్ తెలంగాణ సాధించారని, అభివృద్ధి చేశారని, తెలంగాణ పట్ల ఆయనకు ఉన్నంత ప్రేమ మరెవరికీ ఉండదని బిఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. కానీ అది తప్పని నిరూపించేందుకే సిఎం రేవంత్ రెడ్డి ఈ ఆరోపణలు చేసిన్నట్లు అర్దమవుతూనే ఉంది.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి తీరుని కూడా ఎండగడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని పేరుపెట్టి విమర్శిస్తున్నారు. అయినా వైసీపి నేతలలో చలనం లేదు. ఎవరూ స్పందించకపోవడం విశేషం.
కేసీఆర్, జగన్ మద్య ఇంత సఖ్యత ఉన్నందున కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విభజన సమస్యల గురించి ఇరువురూ చర్చించుకుని రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకునే అవకాశం ఉంది. కానీ పరస్పరం సహకరించుకుంటారు తప్ప సమస్యలను పరిష్కరించుకోరని స్పష్టమైంది.
రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకోగల సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని కలవడం, అదీ తన పదవీ కాలం ముగుస్తున్న సమయంలో వాటి గురించి అడగడాన్ని ఏమనుకోవాలి?






