టీ-టిడిపి నేత రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా వ్యవహరిస్తున్న శైలి తెలంగాణా రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించిన వైనం తెలిసిందే. కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి వెళ్ళడం అనేది లాంచనమే అనుకుంటున్న తరుణంలో… తాజాగా మరోసారి మీడియా ముందరకొచ్చి, పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు.
“నేను ఏ పార్టీలోకి చేరట్లేదు, పార్టీ మారుతున్నానని మీడియానే అనవసరంగా రాద్ధాంతం చేస్తోంది. మీడియా వార్తల వలన కార్యకర్తలు అపోహలకు గురవుతున్నారు. రాబోయే ఎన్నికలలో కోడంగల్ నియోజకవర్గం నుండే పోటీ చేస్తా, టీఆర్ఎస్ పై అవిశ్రాంత పోరాటాన్ని కొనసాగిస్తాను, చంద్రబాబు విదేశాల నుండి వచ్చిన తర్వాత అన్ని విషయాలను వివరిస్తా” అంటూ చెప్పుకొచ్చారు.
రేవంత్ చెప్పిన ఈ వ్యాఖ్యలలో ఒక్కటైతే స్పష్టం… వచ్చే ఎన్నికలలో కూడా కోడంగల్ నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని స్పష్టంగా చెప్పిన రేవంత్ రెడ్డి, ఏ పార్టీ నుండి పోటీ చేస్తాననే విషయంపై అంత స్పష్టత ఇవ్వకపోవడం అనేది దేనికి సంకేతాలో సెలవిచ్చినట్లయితే బాగుండేదన్న టాక్ రాజకీయ వర్గాల నుండి వినపడుతోంది.
చంద్రబాబు నాయుడును ఖచ్చితంగా కలిసిన తర్వాత ప్రస్తుతం ఉన్న సీన్ మారుతుందా? ఇప్పటివరకు జరిగిందంతా ‘ఉత్తుత్తిదే…’ అంటూ చివరికి మీడియాను రాజకీయ చదరంగంలో “ఆటలో అరటిపండు” ను చేస్తారా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రాజకీయాలలో “మీడియా వక్రీకరణలు” సహజమే కదా… అలా అనుకోవాలంతే..!


