తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని, కేసీఆర్ గద్దె దిగి ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వస్తుందని బహుశః ఆయన కూడా ఊహించి ఉండరేమో? కానీ ప్రజాస్వామ్యంలోనే ఇటువంటి అనూహ్య పరిణామాలు జరుగుతాయని అందరికీ ఇది మరోసారి గుర్తు చేసిన్నట్లయింది.
ఎన్నికలలో గెలుపోటములు సహజమే అని కేటీఆర్, హరీష్ రావులు తమ ఓటమిని సమర్ధించుకున్నప్పటికీ, నేటికీ వారు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని వారి మాటలే పట్టి ఇస్తున్నాయి. వారు ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేసే బదులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆరు నెలల్లోగా కూల్చేస్తామని బెదిరించడం మరో పెద్ద తప్పు.
దాంతో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిన్నట్లయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్పై ప్రయోగించేందుకు బిఆర్ఎస్ పార్టీయే స్వయంగా అస్త్రాలు అందించిన్నట్లయ్యింది కూడా. దానిని కాంగ్రెస్ ప్రభుత్వం తెలివిగా ఉపయోగించుకొని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టగలిగింది.
నిజానికి బిఆర్ఎస్ నేతలు చెప్పుకున్నట్లు రేవంత్ ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి ఉండి ఉంటే, హామీలు అమలు విషయంలో అలసత్వం చూపి ఉండేది లేదా అమలు చేయడానికి చాలా సమయం తీసుకుని ఉండేది. అప్పుడు దానంతట అదే బిఆర్ఎస్ పార్టీకి దొరికిపోయేది.
కానీ అధికారం కోల్పోయి తీవ్ర అసహనంతో ఉన్న బిఆర్ఎస్ నేతలు శాసనసభ లోపల, బయటా కూడా కాంగ్రెస్ హామీలను అమలుచేయాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేస్తుండటంతో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రమాదాన్ని గుర్తించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, కష్టమైనా నష్టమైనా చకచకా హామీలను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఇప్పటికే రెండు పధకాలను అమలుచేస్తున్న రేవంత్ ప్రభుత్వం ఈ నెల 27 లేదా 29 నుంచి గృహజ్యోతిలో మరో రెండు పధకాలు అమలుచేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది.
లోక్సభ ఎన్నికలలో హామీల గురించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే అవకాశాన్ని బిఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. అంతేకాదు… కాంగ్రెస్ ప్రభుత్వం చేత హామీలను అమలు చేయించి ఆ పార్టీపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడేలా చేసి పుణ్యం కట్టుకుంది కూడా.
కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసి ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో కేసీఆర్ అత్యుత్సాహం ప్రదర్శించడం, హామీల అమలుకి తొందరపెట్టడం రాజకీయంగా మరో తప్పటడుగు వేసిన్నట్లే చెప్పవచ్చు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ‘బీజేపీతో బిఆర్ఎస్ పార్టీ పొత్తులు’ అంటూ మీడియాకు లీకులు ఇవ్వడం మరో పెద్ద తప్పు. కనుక లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రతి అదనపు ఎంపీ సీటు కూడా కేసీఆర్ పుణ్యమే అనుకోక తప్పదు.




