టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి రాజీనామాతో ఖాళీ కాబోతున్న నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి కనుక ఉప ఎన్నిక జరిగితే టీడీపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ అయితేనే ప్రత్యర్థులను సరిగ్గా ఎదుర్కోగలరని జిల్లా పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు అదే పట్టును తిరిగి కొనసాగించాలని, అందుకు రేవంత్ రెడ్డే సరైన వ్యక్తి అని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇక ఈ నియోజకవర్గంలోని సామాజిక వర్గాలు కూడా రేవంత్కు మద్దతుగా నిలుస్తాయని, ఇక్కడి నుంచి కనుక రేవంత్ బరిలోకి దిగితే విజయం తథ్యమని, టీఆర్ఎస్ పతనం ఖాయమని చెబుతున్నారు. అంతేకాక ఇతర పార్టీలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి నల్గొండ లోక్ సభ నుండి బరిలోకి దిగాలంటూ రేవంత్పై పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధిష్ఠానానిదే తుది నిర్ణయం కాబోతోంది.
టీఆర్ఎస్ లోని అసంతృప్తులు కూడా తమతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పిస్తోన్న ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనపడుతోంది. అయితే ఈ విషయంలో తమ దారి ఎటో తేల్చుకోవాల్సి ఉంటుందని బీజేపీకి రేవంత్ రెడ్డి సూచించారు. పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం రేవంత్ ను బరిలోకి దించేందుకు సుముఖంగా లేరని, రాజకీయంగా ఇది సరైన నిర్ణయం కాదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.



