తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో, దేశంలో, ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలోనే తన అంతటి మేధావి, రాజకీయ చతురుడు లేడన్నట్లు మాట్లాడేవారు. బిఆర్ఎస్ పార్టీలో అందరూ కూడా అదే అనుకునేవారు. అదే చెప్పేవారు. కానీ శాసనసభ ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అది నిజం కాదని బిఆర్ఎస్లో అందరికీ అర్దమయ్యింది.
ఈ నిజాన్ని అంగీకరించిన లేదా గ్రహించినవారు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోతుంటే, కొందరు మాత్రం ఇంకా కేసీఆర్ భజనతో కాలక్షేపం చేస్తున్నారు.
ఈరోజు తెలంగాణ శాసనసభలో బిఆర్ఎస్ సభ్యుల పరిస్థితి చూసినప్పుడు, ఒకప్పుడు సింహాల్లా చెలరేగిపోయినవాళ్ళు వీరేనా కాదా? అనే సందేహం కలుగక మానదు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు శాసనసభలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. దాంతో పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా నియమించిన ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికని కూడా సిఎం రేవంత్ రెడ్డి బయటపెట్టడంతో సభలోనే ఉన్న మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరికీ నోట మాట రాలేదు!
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎక్కడ బ్యారేజి కడితే బాగుటుందో సూచించేందుకు కేసీఆర్ ఆ కమిటీని నియమించారు. అయితే మేడిగడ్డ వద్ద బ్యారేజి కట్టడానికి అవకాశాన్ని పరిశీలించాలని కేసీఆర్ ముందే సూచించారనే విషయాన్ని కూడా వారు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.
అక్కడ కంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుని తక్కువ ఖర్చుతో నిర్మించుకోవచ్చని, అక్కడ నిర్మిస్తే పంపులు అవసరం లేకుండా గోదావరి జలాలు సహజంగా పారుతాయని, దాని వలన ప్రాజెక్ట్ నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుందని ఇంజనీర్ల కమిటీ నివేదికలో అంశాలను సిఎం రేవంత్ రెడ్డి సభలో చదివి వినిపించారు.
కానీ కేసీఆర్ బుర్రలో ముందే మేడిగడ్డ వద్దనే బ్యారేజి నిర్మించాలనే ఆలోచన ఉన్నందున, ఆ నివేదికన పక్కన పడేసి తాను ఏమనుకున్నారో అదే చేశారని, దాని వలన తెలంగాణ రాష్ట్రానికి సుమారు లక్ష కోట్లు వృధా అయ్యాయని, పైగా ఆ ప్రాజెక్ట్ క్రుంగిపోతోందని ఆక్షేపించారు.
ఆ ప్రాజెక్ట్ మరమత్తులు, నిర్వహణ వ్యయం తడిపిమోపెడు అవుతోందని, ఇదేనా… మీ మేధావి కేసీఆర్ చేసిన నిర్వాకం?ఇదేనా… తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన మేలు?అంటూ సిఎం రేవంత్ రెడ్డి నిలదీసి ప్రశ్నిస్తుంటే, సభలోనే ఉన్న మాజీ సాగునీటి మంత్రి హరీష్ రావు జవాబు చెప్పలేక తలదించుకోవలసి వచ్చింది.
శాసనసభ నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయకుండా కూర్చోబెట్టి, వారు చేసిన పాపాలను వినేలా చేయడమే వారికి పెద్ద శిక్ష అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు శాసనసభలో బిఆర్ఎస్ సభ్యుల పరిస్థితి చూస్తే ఇది నిజమే అనిపించక మానదు.
ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందనే ఆలోచనతోనే కేసీఆర్ శాసనసభ సమావేశాలకు వెళ్లకుండా తప్పించుకుంటున్నారు. కానీ బిఆర్ఎస్ సభ్యులు గత్యంతరం లేక సభకు వెళ్ళి లోన కూర్చోలేక బయటకు పారిపోలేక అవస్థ పడుతున్నారు. పాపం వారికి కన్నీళ్ళు ఒక్కటే తక్కువ!




