దొరల పాలన నుండి తెలంగాణ ప్రజలను విముక్తి చేసి ప్రజా పాలనను అందిస్తాం అంటూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రిగా డే వన్ నుండి తన ప్రయత్నాలు మొదలుపెట్టారు రేవంత్.
గ్రామ స్థాయి సమస్యలకు గ్రామ స్థాయిలోనే పరిస్కారం చూపి పాలన విధానాలను ప్రజలకు చేరువ చేయడమే ఈ ప్రజావాణి ఉద్దేశంగా కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. ఆ దిశగానే రేవంత్ ముఖ్యమంత్రిగా తన తొలి అడుగు వేశారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
ప్రగతి భవన్ ఇనుప కంచెలు తొలగించి మొదలుపెట్టిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని గ్రామా స్థాయి వరకు విస్తరించడానికి రేవంత్ ద్రుష్టి సారించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజావాణి కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో అందించడానికి తగిన సూచనలు, సలహాలు తీసుకుంటూ, ఆదేశాలు ఇస్తు పాలన యంత్రాగాన్ని సంసిద్ధం చేస్తున్నారు.
గత ప్రభుత్వ విధానాలలో ఉన్న లోటుపాట్లను, ప్రజావ్యతిరేకతను తన పాలనలో లేకుండా చూసుకోవడానికి తన మార్క్ రాజకీయం తెలంగాణ ప్రజలను తెలియచేయడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న “కేసీఆర్ ప్రజలకు దూరంగా ఫేమ్ హౌస్ కు దగ్గరగా” ఉంటారు అని సొంత పార్టీ నాయకుల నుండి ప్రభుత్వ అధికారులు, ప్రజల వరకు విమర్శలను ఎదుర్కొన్నారు.
ఇప్పుడు అదే తన అవకాశంగా మార్చుకుని నిత్యం ప్రజల మధ్య ఉండడానికి తనతో పాటు తన ప్రభుత్వ యంత్రాగాన్ని సిద్ధం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. అలాగే ఎన్నికల హామీగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కార్యచరణను సిద్ధం చేయడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు, ఆయా శాఖలకు సంబందించిన అధికారులు పాల్గొన్నారు.




