అర చేతిలో త్రిశంకు స్వర్గాన్ని చూపిస్తామని దాదాపు మూడు మాసాల క్రితం 251 రూపాయల మొబైల్ ను ప్రకటించిన రింగింగ్ బెల్ సంస్థ ఇప్పటివరకు ఆ ఫోన్ ను వినియోగదారులకైతే డెలివరీ చేయలేదు. జూన్ నెలాఖరున జరగాల్సిన కార్యక్రమాన్ని జూలై మొదటి వారానికి వాయిదా వేసింది. తాజా ప్రకటనలో మాత్రం శుక్రవారం (జూలై 8వ తేదీ) నుండి 251 రూపాయల స్మార్ట్ ఫోన్ ను డెలివరీ చేస్తామని ప్రకటించింది.
అయితే దీంతో పాటు తమ సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రోడక్ట్ అంటూ 32 అంగుళాల టీవీని కూడా ఆవిష్కరించింది. ఈ హెచ్.డీ. ఎల్ఈడీ టీవీని కేవలం 9,900 రూపాయలుకే అందించనున్నామని, ఆగష్టు 15వ తేదీ నుండి ఈ ఎల్ఈడీ టీవీల డెలివరీ కూడా ప్రారంభిస్తామని తెలిపింది. ఇంత తక్కువ ధరకు అందించడానికి గల కారణాన్ని కూడా వివరిస్తూ… విడి భాగాలను తీసుకువచ్చి వాటితో ఉత్పత్తులు చేస్తున్నామని, అలా ఖర్చులను లెక్కిస్తూ ధరను నిర్ణయిస్తున్నామని సంస్థ సీఈవో మోహిత్ గోయల్ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా హిట్, కింగ్, బాస్, రాజా పేరిట నాలుగు ఫీచర్ ఫోన్లను 699 నుంచి 1099 ధరల మధ్య మరియు ఎలిగెంట్ 3జీ ఫోన్ ను 3,999కు, ఎలిగెంట్ 4జీ ఫోన్ ను 4,999కు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ‘రింగింగ్ బెల్స్’ చెప్తున్న ఐటమ్స్ సామాన్యుడికి అందుబాటులో ఉన్నా… వాటి నాణ్యత ఎంతవరకు ఉంటుందనేది ప్రశ్నార్ధకంగానే ఉంది. అయితే ముందు నాణ్యత విషయం ఎలా ఉన్నా… బుక్ చేసుకున్న వారికి డెలివరీ దశ వరకు రావాలి కదా… అంటున్నారు నెటిజన్లు.



