ఒలింపిక్స్ పోటీల చివరి రోజున రెజ్లింగ్ పోటీల్లో జరిగిన నాటకీయ పరిణామాలు మంగోలియాకు ఒక పతాకాన్ని దూరం చేసాయి. 65 కిలోల రెజ్లింగ్ ఫ్రీ స్టయిల్ విభాగంలో… మంగోలియాకు చెందిన గాంజోరిజిన్, ఉజ్బెకిస్థాన్ కు చెందిన ఇక్తియోర్ తో తలపడగా, బౌట్ ముగియకుండానే గాంజోరిజిన్ సంబరాల్లోకి దిగాడు. ఇంకా బౌట్ మిగిలుండగానే, తానే గెలిచినట్టు భావించిన గాంజోరిజిన్ కు అతని కోచ్ లు కూడా జతకలిశారు.
సమయం కాకుండానే సంబరాల్లోకి దిగినందుకు పెనాల్టీలు వేసి ఇక్తియోర్ గెలిచినట్టు ప్రకటించగా, జడ్జీల నిర్ణయాన్ని విమర్శిస్తూ, మైదానంలోనే వీరంతా బట్టలు విప్పి నిరసన తెలియజేసారు. అలాగే తానూ చేసిన తొందరపాటు పనికి మైదానంలోనే గాంజోరిజిన్ గట్టిగా విలపించి, మోకాళ్లపై కూర్చుని మరో అవకాశం ఇవ్వాలని మొత్తుకున్నాడు.
అయినా న్యాయనిర్ణేతలు ఈ గోడు వినకుండా, ఇక్తియోర్ ను విజేతను ప్రకటించే సమయంలో కూడా గాంజోరిజిన్ పక్కన నిలబడలేదు. దీంతో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు ఈ మంగోలియన్ పై నిషేధం విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.



