ఉన్నదాన్ని చంపి కొత్తదానికి రిబ్బన్ కటింగ్ తో తృప్తి చెందారా..?

Govt Buildings Inaugration

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ‘ఇది కూల్చేద్దామ్ అది మార్చేద్దాం’ అంటూ ప్రజావేదికను కూల్చి, రాజధానిని మార్చి ఎప్పుడు ఎదో ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంటూ, ఓట్లేసిన ప్రజలని ఏమారుస్తు ఇన్నాళ్లు నెట్టుకెళ్లిన జగన్ సర్కార్ చిట్టచివరికి తన మార్పుని రిబ్బన్ కటింగ్ తో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

ఏపీ రాష్ట్రానికి ఒకటి కాదు మూడు రాజధానులు ఉండాలి అంటూ అమరావతి నుండి ఏపీ రాజధానిని విశాఖకు మార్చిన జగన్ తాననుకున్నటుగా విశాఖ వైపు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. అధికారం చేపట్టిన మొదటిలో చెప్పిన మాట కనీసం అధికారం చివరి దశలో కూడా నిలబెట్టుకోలేకపోయారు ముఖ్యమంత్రి జగన్.

ADVERTISEMENT

దసరా అన్నారు, క్రిస్మస్ అన్నారు, లేదు లేదు కొత్త సంవత్సరం అన్నారు, లేదు ఇదే ఫైనల్ అయితే సంక్రాంతి లేకుంటే ఉగాది లో ఏపీ ప్రభుత్వం విశాఖ కు మారిపోతుంది అంటూ ‘ఇలా పండగల పేర్లు మార్చారే తప్ప రాజధాని పేరు మార్చలేకపోయారు’. ఏకంగా ఋషి కొండకు గుండు కొట్టి మరి నిర్మించిన ప్రభుత్వ భవనాలలో కనీసం అడుగు కూడా పెట్టలేకపోయింది వైసీపీ ప్రభుత్వం.

ఋషి కొండలో 450 కోట్లతో క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. మొదట్లో ఇది టూరిజం ప్రాజెక్ట్ అంటూ కవర్ చేసిన వైసీపీ ప్రభుత్వం రాను రాను దానిని సీఎం క్యాంపు ఆఫీస్ గా మార్చి కనీసం ప్రతిపక్షాలను కానీ, మీడియా సిబ్బందిని కానీ అనుమతించకుండా గుప్తనిధులు తవ్వినంత రహస్యంగా నిర్మాణాలను చేపట్టారు.

కొండ చుట్టూ తమ ప్రభుత్వానికి అలవాటైన పరదాలను కట్టి….ఇక్కడికి అనుమతి నిషిద్ధం అనే బోర్డులు తగిలించి….రహస్యంగా నిర్మించిన ఈ భవనాలకు రిబ్బన్ కటింగ్ కూడా అంతే రహస్యంగా ఏర్పాటు చేసింది వైసీపీ సర్కార్. టూరిజం శాఖ కింద కొండ మీద భవనాల నిర్మాణం చేపట్టాం…సీఎం గారు అంగీకరిస్తే ఇక్కడి నుండే సీఎం క్యాంపు ఆఫిస్ ఏర్పాటు చేసి పాలన పరమైన కార్యక్రమాలు చేపడతారు అంటూ టూరిజం మంత్రి రోజా మీడియాకు సమాచారం అందించారు.

అయితే టూరిజం కింద ప్రజల కోసం నిర్మించిన భవనాల ప్రారంభ మహోత్సవానికి కనీసం మీడియా వారికీ కూడా ఆహ్వానం లభించకపోవడం ఇక్కడ కోసమెరుపు. లోపలి అనుమతి ఉండదు కానీ ఫోటోలను బయటకు విడుదల చేస్తాం అంటూ సన్నాయి నొక్కులు నొక్కినా మంత్రి గారికి కేసీఆర్ కూడా ఇదే తరహా మోనార్క్ పాలనకు పోయి ప్రజల ఆగ్రహాన్ని చవి చూడవలసి వచ్చిందనే విషయాన్ని మారిపోయినట్టున్నారు.

టూరిజం మంత్రి రోజా, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాధ్, వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఋషి కొండ మీద నిర్మించిన 7 ప్రభుత్వ భవనాలను ప్రారంభించారు. ఇన్నాళ్లుగా వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం అంటూ ఊరిస్తూ చివరికి రిబ్బన్ కటింగ్ తో తృప్తి చెందారా..? ఉన్నరాజధాని చంపేసి కొత్త రాజధాని పేరుతో భూదందాలకు పాల్పడింది వైసీపీ అంటూ ప్రతిపక్ష పార్టీలు వైసీపీ ప్రభుత్వం పై దుమ్మెత్తిపోస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories