“నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో భూ దందాలకు పాల్పడిన టీడీపీ నేతలు తమ తప్పు లేదని నిరూపించుకోవాలని, న్యాయవిచారణకు సిద్ధపడాలని, ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి, సీబీఐ విచారణను ఎదుర్కొని, నిజాయతీపరులని నిరూపించుకోవాలని” వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. రాజధాని సరిహద్దుల్లోనే నాలుగు ఎకరాల తొమ్మిది సెంట్ల భూమిని పయ్యావుల కొడుకు విక్రమ్ సింహా పేరు మీద కొనుగోలు చేశారని, అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది, ఏ విధంగా ఆ భూములను కొనుగోలు చేశాడనే ప్రశ్నలకు పయ్యావుల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
“ఈ భూదందాపై జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ పోరాడాలని, ప్రశ్నించే తత్వం ఉన్న పవన్ ఈ వ్యవహారంపై నోరు మెదపాలని అన్నారు. గత ఎన్నికల్లో పవన్ ను చూసే ప్రజలు చంద్రబాబుకు ఓటు వేశారని, విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసం అక్రమ కట్టడమని, భూదందా చేయకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో సంబంధిత రికార్డులు ఎందుకు తొలగించారని” ప్రశ్నించారు.
రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు రోజా ఎటువంటి ఆరోపణలనైనా చేస్తుందన్న విషయం రాజకీయ విజ్ఞులకు విదితమే. అందులో భాగంగా టిడిపి నేతలపై ఆరోపణలు చేయడం షరా మామూలే! రానూ రానూ తన విలువను మరింత దిగజార్చుకునే విధంగా రోజా వ్యాఖ్యనిస్తోందని, ఆ అర్ధం పర్ధం లేని ప్రసంగంలో పవన్ కళ్యాణ్ ను ఎందుకు లాగుతున్నారంటూ రోజాపై పవర్ స్టార్ అభిమానులు మండిపడుతున్నారు. రోజా టిడిపి వ్యాఖ్యలపై ఇలాంటి ఆరోపణలు చేస్తుంటే, మరో వైపు దొనకొండ పరిసర ప్రాంతాలన్నీ జగన్ బినామీలేనని అధికార పక్షం తిప్పికోడుతోంది. ఈ విమర్శలకు అంతం ఉండదు గనుక, పవన్ ను ఈ వివాదాల్లోకి లాగవద్దని అభిమానులు రోజాపై మండిపడుతున్నారు.



