పెద్దలు ఉరికే ఏమి చెప్పరు మరి… ఒక వేలు ప్రత్యర్థులకు చూపిస్తే, నాలుగు వ్రేళ్ళు మన వైపే చూపిస్తాయని..! బహుశా ఈ విషయాన్ని వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే అయిన రోజా పూర్తిగా విస్మరించినట్లున్నారు. అందుకే నారా లోకేష్ బెయిల్ పిటిషన్ పైన నేడు పెద్ద పెద్ద ఉపన్యాసాలే ఇచ్చారు.
“మొన్నటివరకు తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పిన లోకేష్, నేడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అంటే లోకేష్ తప్పు చేసానని ఒప్పుకున్నట్లే కదా?” అంటూ తనదైన శైలిలో రోజా తన వాగ్ధాటిని వినిపించారు. అయితే నారా లోకేష్ ముందస్తు బెయిల్ పై వ్యాఖ్యలు చేసే సమయంలో తన పార్టీ కీలక నేతలు ఎంతమంది బెయిల్ పై ఉన్నారన్న విషయం రోజా మరచినట్లున్నారు.
జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొన్న ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మంజూరు చేయించుకోవడం వలనే కదా… ఇప్పటివరకు జైలు పాలు కాకుండా ఉన్నది. అంటే అవినాష్ రెడ్డి తప్పు చేయడం వలనే ముందస్తు బెయిల్ తీసుకున్నారని రోజా చెప్తున్నారా?
ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి విషయమైతే ప్రస్తావించాల్సిన అవసరమే లేదనుకుంటా. గత వారమే బెయిల్ వచ్చిన పదేళ్ల వార్షికోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న చరిత్రను మూటకట్టుకున్న జగన్ కూడా రోజా దృష్టిలో నిందితుడేనా? ఈ బెయిల్ రాక ముందు చాలా కేసులలో జగన్ ముందస్తు బెయిల్ ను దాఖలు చేసుకున్న సంఘటనలు రోజాకు గుర్తు లేవా?
‘విచారణ ఎదుర్కోవడానికి భయమెందుకు లోకేష్’ అంటూ నిలదీసిన ఈ వైసీపీ మహిళా నేతకు, గత నాలుగేళ్లుగా కోడి కత్తి కేసులో కోర్టు ఎదుట జగన్ మోహన్ రెడ్డి ఎందుకు హాజరు కావడం లేదో తెలియదా? నేడు కూడా ఈ కేసు విచారణకు రాగా, యధావిధిగా జగన్ తన ‘అభయ హస్తాన్ని’ కోర్టుకు చూపించారు. దీనిని భయమే అంటారా? ఏమో మన పరిజ్ఞానానికి అందకపోవచ్చు గానీ, రోజా సెలవిస్తే సబబుగా ఉంటుంది.
చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడే క్రమంలో వైసీపీ నేతలకున్న గొప్ప గొప్ప లోపాలను పట్టించుకుకోకుండా మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యలు చేస్తే పట్టించుకునే దశలో ప్రజలు లేరని భావిస్తున్నారా? “గురువింద గింజ” సామెత మాదిరి ఉంది రోజా తీరు. ప్రత్యర్థి నేతలను ఏకరువు పెట్టే క్రమంలో తన పార్టీ పరువును తానే తీసుకుంటుందన్న విషయాన్ని గ్రహించిందో లేదో మరి?!





