ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజన తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. విభజన అనంతరం సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన ఆయన… ఆ తర్వాత బహిరంగంగా కనిపించింది కూడా చాలా తక్కువే. అయితే ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు ఇటీవల చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని బలపరుస్తూ… ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఊమెన్ చాందీ ఈ రోజు హైదరాబాదులోని కిరణ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఏపీకి చెందిన పలువురు నేతలు కూడా హాజరయ్యారు.
భేటీ అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… తాను కాంగ్రెస్ లో చేరుతున్నాననేవి కేవలం వార్తలు మాత్రమేనని… సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తానని అన్నారు. ఊమెన్ చాందీ మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే కాకుండా, యావత్ దేశానికే కీలక సమయమని చెప్పారు. విభేదాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ దేశం కోసం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. కాంగ్రెస్ ను వీడిన నేతలందరినీ మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పార్టీలోకి ఆహ్వానించామని… తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ఆయనే అని తెలిపారు.



