మెగా కాంపౌండ్ లో విషయాలు అధికారికంగా బయటకు రావడమంటే… అవి ఏళ్ళు గడవాల్సిందే..! మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీ మొదలుకుని, ఇటీవల పూర్తి చేసిన 150వ సినిమా వరకు అన్ని విషయాలను తెగేదాకా లాగడంలో మెగా కాంపౌండ్ సిద్ధహస్తులుగా ఖ్యాతి గడిచింది. ఒక్కోసారి దీని వలన సానుకూలతే జరిగినా, అభిమానుల సహనానికి మాత్రం అగ్ని పరీక్ష మాదిరి తయారవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ ఆసక్తికరమైన చర్చే జరుగుతోంది.
ఇటీవల మెగా హీరోగా తెలుగు తెరకు పరిచయమై సత్తా చాటుతున్న సాయిధరమ్ తేజ్ కు, నాగబాబు తనయురాలిగా బుల్లితెరకు, సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైన నిహారికకు వివాహం జరగబోతుందన్న ఓ వార్త మీడియా వర్గాల్లో తెగ హల్చల్ చేస్తోంది. మెగా కాంపౌండ్ లోని బావమరదళ్ళు కావడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత లభించింది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందన్నది ప్రశ్నార్ధకమే. దీనికి సంబంధించి ఎలాంటి ఖండించే వార్త గానీ, సమర్ధించే సమాచారం గానీ మెగా వర్గీయుల నుండి వ్యక్తం కాలేదు.
నిజంగా ఇందులో వాస్తవం లేకపోతే సోషల్ మీడియా ద్వారా మెగా కుటుంబానికి చెందిన ఎవరో ఒకరు ఒక్క పోస్ట్ పెడితే అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. మౌనం అంగీకారం అనుకుంటే… దానికి ఆస్కారం లేని విధంగా ఒక్కోసారి ట్విస్ట్ ఇస్తారు. ఈ లోపల అభిమానుల్లో ఉత్సుకత అంతకంతకూ పెరిగిపోతోంది. మరో విశేషమేమిటంటే… ట్రేడ్ వర్గాలలో కూడా ఈ ప్రతిపాదనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘అవును నిజమే’ అంటూ చెప్పేవారు ఎంతమంది ఉన్నారో, ‘ఇదంతా ఒట్టి పుకారే’ అంటూ కొట్టిపడేసేవారు కూడా అలాగే ఉన్నారు. దీంతో ఇది ఇప్పట్లో తేలే విషయం కాదనుకునుకోవడం ఉత్తమం!



