వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ సలహాదారుగా అంతా తానై జగన్ ప్రభుత్వాన్ని నడిపించారు.
ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై చెలరేగిపోతే, ఆయన కుమారుడు భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాలో తన ప్రెస్మీట్లను వైరల్ చేసేవారని మరో సలహాదారు పోసాని కృష్ణ మురళి స్వయంగా పోలీసులకు చెప్పిన సంగతి తెలిసిందే.
అంటే ఎప్పుడు ఎవరు, ఎవరి మీద, ఏవిదంగా దాడి చేయాలి?వంటి చిన్న చిన్న పనులు మొదలు వివేకా హత్య కేసుని ఏవిదంగా డీల్ చేయాలనే విషయం వరకు అన్నీ సజ్జల రామకృష్ణా రెడ్డే స్వయంగా చూసుకునేవారని అందరికీ తెలుసు.
తెలియనివారుంటే వైసీపీని వీడిన కోటంరెడ్డి, విజయసాయి రెడ్డి వంటివారు, మొన్న పోసాని ఎవరికీ తెలియని కొత్త కొత్త విషయాలు చెపుతూనే ఉన్నారు.
జగన్కు సజ్జల రామకృష్ణా రెడ్డి వంటివారు శల్య సారధ్యం చేస్తూ ముంచేస్తున్నారని అప్పుడే M9 న్యూస్తో సహా మీడియా హెచ్చరిస్తుండేవి. అవి చెప్పినట్లే ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత కానీ జగన్ మేల్కోలేదు. ముందుగా సజ్జలని పక్కన పెట్టేశారు.
కానీ విజయసాయి రెడ్డివంటి ముఖ్యనేత పార్టీని వీడి వెళ్ళిపోవడం సజ్జలకు బాగా కలిసి వచ్చిన్నట్లుంది. జగన్ మళ్ళీ సజ్జలని చంకనెక్కించుకున్నారు.
ఇది వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్కరికీ రూ.2-3 లక్షల చొప్పున ప్రభుత్వం తరపున జీత భత్యాలు చెల్లిస్తూ 50 మందికి పైగా సలహాదారులని నియమించుకున్నారు. కానీ ఇప్పుడు జేబులో నుంచి అంత డబ్బు ఖర్చు చేయలేరు కనుక పార్టీలో 33 మంది సీనియర్ నేతలతో ఓ రాజకీయ సలహా కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.
దానికి సజ్జల రామకృష్ణా రెడ్డిని సమన్వయకర్తగా నియమించారు. అంటే పార్టీలో 33 మంది సీనియర్లకు సజ్జల హెడ్ అన్నమాట! అంటే సజ్జలకు మళ్ళీ రాజయోగం మొదలైన్నట్లే.
ఇదివరకు 175/175 మనకే అనే భ్రమలో జగన్ విర్రవీగుతుంటే, 50 మందికి పైగా పెయిడ్ సలహాదారులు, వందల కోట్లు ఫీజు తీసుకుంటున్న ఐప్యాక్, కోటరీలో ఉండే సజ్జల, విజయసాయి రెడ్డి, సీనియర్ నేతలు, మంత్రులు ఎవరూ కూడా ‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. కనుక 175/175 సాధ్యం కాదు.. కూటమి కాదు మనమే చాలా ప్రమాదంలో ఉన్నామని’ జగన్ని హెచ్చరించలేదు. కానీ వారందరూ చేయాల్సిన ఈ పనిని ప్రతిపక్షాలు, మీడియా చేస్తుంటే అందరూ కలిసి ఎదురుదాడి చేశారే తప్ప వాటి ప్రమాద హెచ్చరికలను పట్టించుకోలేదు.
ఒకవేళ ఆనాడే వారు ధైర్యం చేసి జగన్ని హెచ్చరించినా లేదా మీడియా ప్రమాద ఘంటికలను చెవికి ఎక్కించుకుని తప్పులు సరిదిద్దుకున్నా నేడు వారికీ, జగన్కీ ఈ దుస్థితి కలిగి ఉండేదే కాదు కదా?
దాని బాధ్యత సజ్జల రామకృష్ణా రెడ్డికి అప్పగించారు… కనుక మళ్ళీ అందరూ కలిసి జగన్కి శల్య సారధ్యం చేయక తప్పదు. ఈసారి కూటమి ‘సింగిల్ డిజిట్’కి పరిమితమవుతుందని జగన్ ముందే ఓ లైన్ ఇచ్చేశారు. కనుక సలహా కమిటీ దానిని పట్టుకొని మంచి పిక్చర్ రెడీ చేయాల్సిందే.
ఏతావాతా తేలిందేమిటంటే జగన్కి ఎవరి బోడి సలహాలు అవసరం లేదని! కానీ ఉచిత-రాజకీయ సలహాదారుల కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.. దేనికంటే తాన తందాన పాడేందుకు!




