ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కువగా కనబడేది ప్రెస్మీట్లలోనే. వివేకా హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తరపున అడ్వకేట్లా వాదించేస్తూ తీర్పులు చెప్పేస్తుంటారు. సీబీఐకి ఈ కేసు విచారణ చేతకాదని తేల్చి చెప్పేస్తుంటారు. సజ్జల ఇంత మేధావి కనుకనే జగన్ ఆయనను సలహాదారుగా నియమించుకొన్నారు. అయితే ఆయన ప్రభుత్వానికి బదులు ప్రజలకు సలహాలు ఇస్తుంటారు! అదే విచిత్రం. ఇప్పుడు ఆయన కూడా మైకు పట్టుకొని ప్రజల మద్యకు బయలుదేరారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట-చిల్లకల్లు మద్య రూ.14 కోట్లతో నిర్మించిన రోడ్డుకి ఆయన ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రమంతటా రోడ్లు గోతులు పడి, ఇటీవల కురుస్తున్న వర్షాలతో చిన్న చిన్న చెరువులుగా మారాయని రోజూ మీడియాలో వార్తలు వస్తుంటే, ఓ రోడ్డు నిర్మించి దేశంలో మరే రాష్ట్రంలోను జరగనంత అభివృద్ధి ఏపీలో జరిగిందని సజ్జల నిసిగ్గుగా చెప్పుకోవడం విశేషం. .
చంద్రబాబు నాయుడుకి వయసైపోయిందని, ఆయనను నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి మోస్తూ సిఎం కుర్చీలో కూర్చోపెట్టాలని ప్రయత్నిస్తారంటూ సజ్జల ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలొస్తాయంటూ చంద్రబాబు, లోకేష్, పవన్ ముగ్గురూ తెగతిరిగేస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ వారు ఎంత హడావుడి చేసినా, ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది జగన్ ప్రభుత్వమే అని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ముందు వచ్చినా, తర్వాత వచ్చినా తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని సజ్జల అన్నారు.
అయితే సజ్జల అకస్మాత్తుగా వైసీపీ నేతలను వెంటేసుకొని ప్రజల మద్యకు ఎందుకు వచ్చారు?ఆయన కూడా ఈసారి పార్టీ టికెట్ ఆశిస్తున్నారా?లేక టిడిపి, జనసేనలు వరుసపెట్టి పాదయాత్రలు, వారాహి యాత్రలు చేస్తూ సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహిస్తూ దూసుకుపోతుంటే, వైసీపీలో బటన్ నొక్కుడు సభలు తప్ప మరేదీ జరగడంలేదని, ఇలా అయితే వెనుకబడిపోతామని ఐప్యాక్ సజ్జలకు సలహా చెప్పిందేమో తెలీదు.
నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురూ నిత్యం ప్రజల మద్యే ఉంటున్నారు. ప్రజలు వారికి జేజేలు పలుకుతున్నారు. చివరికి జగన్-అడ్డా పులివెందులలో కూడా నిన్న చంద్రబాబు నాయుడు సభకి వేలాదిగా ప్రజలు తరలివచ్చి సంఘీభావం తెలుపడంతో వైసీపీలో కలవరం మొదలయ్యిన్నట్లుంది. కనుక ఇకపై మంత్రులు, ఎమ్మేల్యేలు కూడా సభలు, రోడ్ షోలు చేస్తారేమో?





