పోలింగ్ సరళిని బట్టి రాజకీయ పార్టీలు తమ గెలుపోటములను ముందే పసిగట్టగలవు. ఈసారి ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలలో కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి రాబోతోందని వైసీపి నేతలే ఏడుపులే స్పష్టం చేస్తున్నాయి.
వైసీపి నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న తీరు, పోలీసులపై చేస్తున్న ఆరోపణలు వింటున్నప్పుడు రాష్ట్రంలో నేటికీ తామే అధికారంలో ఉన్నామనే విషయం వారికి గుర్తులేదా? అనే సందేహం కలుగుతుంది.
మంత్రి అంబటి రాంబాబు పోలీసులు తమ పిర్యాదులను పట్టించుకోవడం లేదని, అప్పుడే టిడిపి నేతలు చెప్పిన్నట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. అంటే ఎన్నికలలో కూటమి గెలిచి అధికారంలోకి రాబోతోందని పోలీసులు కూడా గ్రహించారని అంబటి రాంబాబు చెపుతున్నారని అనుకోవచ్చు.
సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ, “బీజేపీతో టిడిపి పొత్తు కుదిరినప్పటి నుంచే రాష్ట్రంలో అధికారుల బదిలీలు మొదలయ్యాయి. ఎన్నికల సమయంలో అధికారులను బదిలీ చేస్తే ఇంక నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎలా జరుగుతాయి?
పోలింగ్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న దాడులను చూస్తుంటే అధికారులని తీవ్ర ఒత్తిడికి గురిచేసి తమ చెప్పు చేతల్లో ఉంచుకుని కౌంటింగ్లో కూడా ఏదో పెద్ద కుట్ర చేయబోతున్నట్లే మాకు అనుమానంగా ఉంది,” అని అన్నారు.
అసలు బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నదే ఇందు కోసమని సజ్జలకు కూడా తెలుసు కదా?ఎన్నికలలో వైసీపి చొక్కా మడత పెట్టి పేట్రేగిపోతుందని ముందే ఊహించారు.
జగన్ ప్రభుత్వాన్ని దాని కనుసన్నలలో పనిచేస్తున్న ఉన్నతాధికారులను కేంద్ర ఎన్నికల కమీషన్ చేత కట్టడి చేయకపోతే ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా జరగవని గ్రహించారు గాబట్టే బీజేపీతో పొత్తుకి సిద్దపడ్డారు. ఇందుకోసం టిడిపి, జనసేన రెండూ తమ సీనియర్లను కూడా పక్కనపెట్టి తమ సీట్లను త్యాగం చేశాయి కూడా.
ఈవిషయం జగన్, సజ్జలతో సహా ఉన్నతాధికారులకు కూడా తెలుసు. కానీ తమని ఎవరూ పీకలేరు అనే ధీమాతో కొందరు ఉన్నతాధికారులు వైసీపి నేతలకు అనుకూలంగా వ్యవహరించారు. కేంద్ర ఎన్నికల కమీషన్ వారిపై వేటు వేసింది. ఒకవేళ వారే ఉంటే వైసీపి గెలిచి ఉండేదని, వైసీపి గెలిస్తేనే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగిన్నట్లని సజ్జల చెపుతున్నారనుకోవచ్చు.
అయినా ఈసారి ఎన్నికలలో వైసీపి 175కి 175 సీట్లు గెలుచుకోబోతోందని జగన్ ముందే చెప్పేశారు. కనుక పోలింగ్ ముగియగానే వైసీపి నేతలు, కార్యకర్తలు అందరూ టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచుకొని విజయోత్సవాలు చేసుకోవాలి కదా? కానీ అందరూ ఇలా ఏడ్పులు ఏడుస్తున్నారెందుకు? అంటే కూటమి గెలుపుని వారే నిర్ధారించేస్తున్నారన్న మాట!
రాష్ట్రంలో నేటికీ తామే అధికారంలో ఉన్నామనే విషయం ఎవరికీ గుర్తేలేన్నట్లు మాట్లాడుతుండటం గమనిస్తే, అప్పుడే అందరూ స్వచ్ఛందంగా తమ పదవులు, అధికారం త్యజించేసేసిన్నట్లే అనిపిస్తోంది. అధికారంలో నుంచి దిగిపోవడానికి కూడా తొందరేనా?జూన్ 4 తర్వాత ఎలాగూ దిగిపోతారు కదా?




