వైసీపి అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి జగన్ మనసులో ఆవేశాన్ని, మాటలను, ఆలోచనలను ప్రెస్మీట్ చెప్పి వివరిస్తుండేవారు. ఆయన అంతవరకే పరిమితమై ఉంటే బాగుండేది కానీ ‘సకల శాఖా మంత్రిగా’ చక్రం తిప్పుతూ చేయకూడని పనులన్నీ చేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
ఆయన జగన్కు శల్య సారధ్యం చేస్తూ ఎన్నికలలో వైసీపిని నిలువునా ముంచేశారని వైసీపిలోవారే చెప్పుకున్నారు. కనుక జగన్ ఆయనని పక్కన పెట్టేశారు. కానీ ఆయన లేని లోటు జగన్కు వెంటనే తెలిసొచ్చింది.
ఆయన ఉన్నంతకాలం జగన్కు ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయనను పక్కన పెట్టినప్పటి నుంచి స్వయంగా ప్రెస్మీట్లు పెట్టి తడబడుతూ మాట్లాడాల్సివస్తోంది. ఒకవేళ తప్పుగా మాట్లాడితే ఆ నెపం ఎవరి మీదో తోసేసి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది జగన్కి.
కనుక మళ్ళీ ఆయనకు పార్టీలో ‘రాష్ట్ర కో-ఆర్డినేటర్’గా కీలక పదవి కట్టబెట్టారు. కనుక త్వరలోనే సజ్జలవారు మళ్ళీ మీడియాలో ప్రజలనుద్దేశ్యించి ప్రవచనాలు, కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి ఆగ్రహ సంభాషణలు చేస్తూ కనిపించే అవకాశం ఉంది.
ఆయనకు జగన్ ఈ కీలక పదవి కట్టబెట్టడానికి మరో బలమైన కారణం కూడా కనిపిస్తోంది. వైసీపి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జిగా వ్యవహరించి ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి లోపల వేశారు. కనుక జూనియర్ సజ్జలని జగన్ జైలు నుంచి విడిపించకపోతే సీనియర్ సజ్జలకు ఆగ్రహం వస్తుందని ముందే చెప్పుకున్నాము.
పైగా జూనియర్ సజ్జల కోసం సీనియర్ సజ్జల సిఎం చంద్రబాబు నాయుడుతో మనస్ఫూర్తిగా పోరాడుతారు కూడా. కనుక ఆయనని శాంతింపజేసి, మళ్ళీ ప్రెస్మీట్లు పెట్టించి చంద్రబాబు నాయుడుని తిట్టించడానికే బహుశః జగన్ ఆయనకు ఈ కీలక పదవి కట్టబెట్టి ఉండవచ్చు.




