ఈసారి ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమీషన్ జగన్ ప్రభుత్వానికి వరుసపెట్టి షాకులు ఇవ్వడంతో సజ్జల రామకృష్ణా రెడ్డి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ‘పోలింగ్లో ఈసీ ఎంపైరింగ్ బాగోలేదు… కౌంటింగ్లో కూడా ఏదో పెద్ద కుట్ర జరుగబోతున్నట్లు మాకు అనుమానంగా ఉంది. ఏదైనా తేడా కనిపిస్తే గట్టిగా ఎదుర్కుంటాము. ముఖ్యంగా పోలీస్ అబ్జర్వర్గా దీపక్ మిశ్రాను తక్షణం అక్కడి నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.
అంటే పోలింగ్లో ఈసీ మాకు ఎలాగూ సహకరించలేదు కనీసం కౌంటింగ్లోనైనా తమకు సహకరించాలన్నట్లున్నాయి సజ్జల మాటలు. నిజానికి పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉండవచ్చు. కానీ కౌంటింగ్ కేంద్రాల లోపలా, బయటా చుట్టూ ఏర్పాటు చేయబడిన అనేక సీసీ కెమెరాలు, ఎన్నికల సంఘం పరిశీలకులు, పోలీస్ శాఖ పరిశీలకులు, అన్ని పార్టీల ఏజంట్లు కౌంటింగ్ ప్రక్రియని నిశితంగా గమనిస్తుంటారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ మూడంచెల పటిష్టమైన పోలీస్ భద్రత ఉంటుంది.
కనుక ఈ ప్రక్రియలో అవరోధాలు, అవకతవకలు జరిగే అవకాశం చాలా తక్కువే. కానీ ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి పదేపదే చెపుతున్నారు. అంటే కౌంటింగ్లో అవకతవకలు ఎలా చేయవచ్చో తమకు తెలుసని చెపుతున్నట్లే ఉంది.
సజ్జల ఉద్దేశ్యం ప్రకారం నిష్పక్షపాతంగా కౌంటింగ్ అంటే తాము ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులతో బందోబస్తుతో కౌంటింగ్ జరపడం అని అర్దమవుతోంది.
ఈవిదంగా ప్రతీ రాష్ట్రంలో అధికార పార్టీలు తమ కనుసన్నలలో పనిచేసే అధికారులతో పోలింగ్, కౌంటింగ్ నిర్వహించుకోవాలనుకుంటే, ఇక ఎన్నికలు నిర్వహించడం దేనికి? శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసేసుకుని మళ్ళీ తామే అధికారంలో కొనసాగుతామని ప్రకటించేసుకుంటే సరిపోతుంది కదా?కానీ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యాన్ని కాపాడి అమలుచేసేందుకు రాజ్యాంగం, న్యాయస్థానాలు ఉండటం ప్రజల అదృష్టమే అనుకోక తప్పదు. ఏది ఏమైనప్పటికీ, సజ్జల రామకృష్ణా రెడ్డి మాటలను ఆక్రోశంగా భావించి కొట్టిపడేయడానికి లేదు. కౌంటింగ్ గురించి సజ్జల రామకృష్ణా రెడ్డి పదేపదే మాట్లాడుతుండటం గమనిస్తే దానిలో వైసీపి ఏదో మాయ చేయబోతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనుక ఎన్నికల సంఘం, టిడిపి, జనసేన, బీజేపీలు, పోలీసులు అందరూ మరింత అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది.




