ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి ఏడుగురు అభ్యర్ధులను గెలిపించుకొనే బలం ఉన్నప్పటికీ, ఎవరూ క్రాస్ ఓటింగ్ చేయకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకొన్నప్పటికీ, పార్టీలో అసంతృప్త నేతలను సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా పిలిచి బుజ్జగించినప్పటికీ, క్రాస్ ఓటింగ్ జరిగింది. వైసీపీ అభ్యర్ధి కోలా గురువులు ఓడిపోయారు. టిడిపి అభ్యర్ధి పంచుమర్తి అనురాధ గెలిచారు. కనుక ఎందుకిలా జరిగింది? పార్టీలో కట్టప్పలు ఎవరూ?అని వైసీపీ వెంటనే పరిశీలించుకొంటే నలుగురు కనబడుతున్నారు.
వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, ఆనం రామనారాయణ రెడ్డిని వైసీపీకి చెందిన వారిగా పరిగణించడంలేదని చెపుతూ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో కట్టప్పల సంఖ్యని కుదించే ప్రయత్నం చేశారు. అయితే ఆ మిగిలిన ఇద్దరు కట్టప్పలు ఎవరు?అనే విషయం కనిపెట్టామని చెప్పారు. కానీ వారి పేర్లను బయటపెట్టబోమని, అలాగే వారిపై ఇప్పటికిప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోబోవడంలేదని, ఎందుకంటే రాజకీయాలంటే ఉద్యోగాలు కావని సజ్జల సమర్ధించుకోవడం పార్టీ నిస్సహాయతను కప్పిపుచ్చుకొనే ప్రయత్నమే. టిడిపి వారిని ప్రలోభపెట్టడం వలననే క్రాస్ ఓటింగ్కు పాల్పడి ఉంటారని భావిస్తున్నామని సజ్జల చెప్పుకోవడం నిస్సహాయతనే సూచిస్తోంది.
ఇంతకీ ఆ కట్టప్పలు ఎవరు?అంటే నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి మేకతోటి సుచరిత, ఉండవల్లి శ్రీదేవిల పేర్లు వినబడుతున్నాయి. పార్టీలో చాలా సీనియర్ అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వలేమని సిఎం జగన్ చెప్పేయడమే కాక ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ధనుంజయ్ రెడ్డిని నియమించారు కూడా. కనుక మేకపాటి చాలా ఆగ్రహంగా ఉన్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కూడా. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు, తర్వాత కూడా ఆయన వైసీపీ అధిష్టానం ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం లేదు. అంటే ఆయన వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని స్పష్టం అవుతోంది.
ఇక తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇచ్చే ఉద్దేశ్యం లేదని తెలియజేస్తూ ఆ నియోజకవర్గానికి డొక్కా మాణిక్య వరప్రసాద్ను ఇన్ఛార్జ్గా నియమించారు. అప్పటి నుంచి ఆమె తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కానీ పార్టీ అధిష్టానం ఆమెను పట్టించుకోలేదు. అయితే మొన్న సిఎం జగన్మోహన్ రెడ్డి ఆమెను పిలిపించుకొని బుజ్జగించారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఉండవల్లి శ్రీదేవి స్పందిస్తూ సిఎం జగన్మోహన్ రెడ్డి తనను అన్నలా చూసుకొంటానని హామీ ఇచ్చారని కనుక తాను జగనన్నకు ద్రోహం తలపెట్టలేదని, క్రాస్ ఓటింగ్ చేయలేదని వివరణ ఇచ్చుకొన్నారు.
పత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే, మేకతోటి సుచరితకు మొదట కీలకమైన హోమ్ మంత్రి పదవి ఇచ్చి, రెండేళ్ళు కాగానే పదవిలో నుంచి తొలగించడంతో ఆమె తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయం బహిరంగంగానే చెప్పారు కూడా. కనుక వీరిద్దరిలో ఒకరు వైసీపీని దెబ్బతీసి ఉండవచ్చు. అంటే పార్టీ పట్ల అసంతృప్తితోనే క్రాస్ ఓటింగ్ చేశారని స్పష్టమవుతోంది. కనుక టిడిపి ప్రలోభాలకు లొంగిపోయి వారు క్రాస్ ఓటింగ్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటలు అబద్దమని స్పష్టం అవుతోంది.



