విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ కావడంతో, మాంచి జోష్ మీదున్న “సంక్రాంతికి వస్తున్నాం” టీమ్, అదే ఉత్సాహంతో ప్రమోషన్ విభాగంలోనూ మిగిలిన సినిమాల కంటే ముందు వరుసలో ఉంది. చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి పబ్లిసిటీ విభాగాన్ని కూడా తనదైన వినోదంతో నింపి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
చాలాకాలం తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు, ఒకప్పటి సంచలనం రమణగోగుల గాత్రం అందించిన ‘గోదారి గట్టు మీద’ పాట విశేషాలు తెలియజేస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఆద్యంతం వినోదభరితంగా తీర్చిదిద్దారు అనిల్. చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్, పాట రచయిత భాస్కరభట్ల, కొరియోగ్రాఫర్ భాను, రమణగోగులతో కూడిన చిట్ చాట్ లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు దర్శకుడు అనిల్.
మేము బేసిక్ గా రచయితలము కాబట్టి మాకేదో సాహిత్య విలువలు తెలిసిపోయినట్టు, అప్పుడప్పుడూ కొద్దిగా ఎక్స్ ట్రాలు చేస్తుంటాము కదా, ఆ క్రమంలోనే సినిమా నేపథ్యంలో వచ్చే సీన్ ను బట్టి ‘రావే నా రాజమండ్రి రోజ్ మిల్క్ వే’ అని తాను రాసినట్లుగా అనిల్ నవ్వులు పూయించారు. రచయిత భాస్కరభట్ల తోడయిన తర్వాత అది కాస్త ‘గోదారి గట్టు మీద రామచిలుకవే’గా మారిందని లిరిక్స్ కు సంబంధించిన విశేషాలను వెల్లడించారు.
ఈ సాహిత్యానికి రమణగోగుల స్వరం పాటను ఎక్కడికో తీసుకువెళ్లిందని చెప్పిన అనిల్ మాటల్లో ఇప్పటికే బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న నమ్మకం కనపడుతోంది. నిజానికి పాట కూడా అంత ప్రాచుర్యం పొందింది కూడా! సోషల్ మీడియా రీల్స్ లో వైరల్ అవుతోంది ఈ పాట. దీనితో పాటు రిలీజ్ అయిన మరో సాంగ్ ‘మీను’ కూడా ఆహ్లాదకరంగా, వీనులవిందుగా ఉండడంతో, వెంకీకి ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా ఓపెనింగ్స్ కు దోహదపడవచ్చు.
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాతో అనిల్ రావిపూడి మరోసారి “సంక్రాంతి డైరెక్టర్” అనిపించుకుంటారేమో చూడాలి. ఇప్పటికే “ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరూ, ఎఫ్ 3” సినిమాలతో సంక్రాంతికి వరుస హిట్లు అందుకున్న దర్శకుడిగా ఖ్యాతి గడించిన అనిల్, మరోసారి అదే తరహా వినోదాన్ని అందిస్తే, విజయం అనేది ‘నల్లేరు మీద నడకే!’




