రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల పాటు సరదా సరదగా సాగే సంక్రాంతి సందళ్ళు వినోదాన్ని పంచేవిగా ఉండాలే కానీ విషాదాన్ని తెచ్చేవిగా ఉండకూడదు.
ఈ వేడుకలలో మొదటి రోజు భోగి మంటలతో మొదలయ్యే ఈ సంతోషాలు, గాలిపటాల ఆటలతో, కోడి పందాల సై ఆటలతో, విందు భోజనాల కోలాహలంతో ముగుస్తాయి.
అయితే సంస్కృతిలో భాగంగా జరుపుకునే గాలిపటాల ఆటలు కొన్ని కొన్ని ప్రాంతాలలో మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. గాలిపటాలను ఆకాశంలో రెపరెపలాడించడం కోసం వాడే మాంజాలు పొరపాటున వ్యక్తుల గొంతులను కోస్తున్నాయి. మూగ జీవుల ప్రాణాలు హరిస్తున్నాయి.
ఈ మాంజా వినియోగం కొన్ని కుటుంబాలలో పండుగ సంతోషాలను విషాదంగా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ సీపీ సజ్జనార్ సైతం ఈ మాంజా మరణాల పై స్పందిస్తూ సంక్రాంతిన పతంగులు ఎగరవేసే మన ఆనవాయితీ పక్షుల ప్రాణాలు తీస్తున్నాయి,
అలాగే ఈ మాంజాలు అమాయక వాహనదారుల మెడకు తగిలి వారి ప్రాణాలను హరిస్తున్నాయి. కాబట్టి పతంగుల సంతోషాలు విషాదంగా మారకుండా వినియోగదారులు తగు జాగ్రత్తలు పాటించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. నైలాన్, గాజు పొడి అద్దిన సింథటిక్ దారాలు (చైనా మాంజలు) పూర్తిగా నిషేధింపబడ్డాయి.
వాటిని ఇక్కడ అమ్మినా, కొన్నా, వాడిన వారి పై చట్ట పరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు సజ్జనార్. ఇప్పటికే ఈ మాంజ బారిన పడి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వార్తలు ఎదో ఒక మూల వింటూనే ఉంటున్నాం. అయినా కూడా ఈ చైనా మాంజా ఎంతో మంది అమాయకుల ఉసురు తీయడానికి కొంతమంది చేతిలో ఆయుధంగా మారుతుంది.
పండుగ సరదాలు, సంస్కృతీ – సంప్రదాయాలు భావితరానికి సంతోషాన్ని పంచేవిగా చూపించాలే తప్ప అవి మనుషుల ప్రాణాలు తీసే చాదస్తాలుగా చిత్రీకరించకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ పండుగ సరదాలను ఇతరుల ఇళ్లలో శోకాలుగా మార్చకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.







