వివేకా హత్య కేసులో నిందితుడుగా ఉన్న డ్రైవర్ దస్తగిరి అప్రూవర్గా మారడంతో ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి దానిలో నుంచి బయటపడేందుకు నానా తిప్పలు పడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రా రెడ్డి కూడా అప్రూవరుగా మారిపోయారు. ఈ మేరకు నేడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయగా, కోర్టు దానిని అనుమతించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ సిఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, ఏపీలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలదే కీలకపాత్ర అని, వారిద్దరి బినామీలే అరుణ్ పిళ్లై, శరత్ చంద్రా రెడ్డిలని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పుడు వారిలో శరత్ చంద్రా రెడ్డి అప్రూవరుగా మారిపోయినందున, తెర వెనుక జరిగిన ఈ భాగోతం పూర్తిగా బయటపడుతుంది.
అయితే ఆయన అప్రూవరుగా మారబోతున్నారనే విషయం విజయసాయి రెడ్డికి ముందుగా తెలియదనుకోలేము. బహుశః ఢిల్లీ పెద్దలతో వైసీపీ పెద్దల చర్చల తర్వాతే మద్యే మార్గంగా ఈ ఏర్పాటు జరిగి ఉండవచ్చు.
బిజెపి టార్గెట్ తెలంగాణలో కేసీఆర్ని గద్దె దించి అక్కడ అధికారంలోకి రావడమే తప్ప ఏపీ రాజకీయాలు కావు కనుక ఈ ఏర్పాటు వలన వైసీపీ ఎంపీ మాగుంటకు ఎటువంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా మొక్కుబడి విచారణలతో ఆ తంతు పూర్తయిపోవచ్చు.
“కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తే తప్ప తెలంగాణలో బిజెపిని ఎవరూ నమ్మరని” ఆ పార్టీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవలే చెప్పారు. ఆయన ఆ మాట అన్న తర్వాతే ఈ పరిణామం జరగడం చూస్తే రాష్ట్ర బిజెపి నేతల ఒత్తిడి మేరకే ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఈ తాజా పరిణామమని భావించవచ్చు. కనుక ఆ కేసులో చిక్కుకొన్న కల్వకుంట్ల కవితకు మళ్ళీ సమస్యలు తప్పకపోవచ్చు. కర్ణాటక ఎన్నికలకు దూరంగా ఉండిపోయి కేసీఆర్ కూతురును కాపాడుకొన్నట్లుగా, మళ్ళీ బిజెపికి సరెండర్ అయ్యి కూతురును కాపాడుకొంటారా లేదా కత్తులు దూస్తారా?అనేది ఈ కేసులో కదలికలను బట్టి తెలుస్తుంది.



