రాజకీయ నాయకులకి, పోలీస్ అధికారులకు మద్య విడదీయరాని బంధాలు ఉంటాయనేది జగమెరిగిన సత్యం. కనుక ఒకరినొకరు కాపాడుకుంటూ, సహకరించుకుంటూ కలిసి సాగుతుంటారు.
కానీ ఎక్కడైనా తేడా వస్తే రాజకీయ నాయకులు పోలీస్ అధికారులను బలి చేయడానికి ఏమాత్రం వెనకాడరని ‘ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబందం లేదని, తప్పులు చేసిన అధికారులే బాధ్యులని కేసీఆర్ చేతులు దులిపేసుకోవడం అందరూ చూశారు.
ఆ కేసులో జైలు పాలైన పోలీస్ అధికారులు కేసీఆర్ కోసం తప్పుడు పనులు చేసినందుకు ఇప్పుడు తాపీగా పశ్చాత్తాప పడుతున్నారు. కానీ అధికార పార్టీ నేతల కోసం తప్పుడు పనులు చేస్తే చివరికి బలయ్యేది అధికారులేనని ఇది నిరూపిస్తోంది.
ఆంధ్రాలో కూడా వైసీపి నేతలతో పోటీ పడుతున్నట్లుగా జగన్ ప్రభుత్వానికి అవసరమైన ప్రత్యేక సేవలు అందించడానికి తహతహలాడిన వివిద శాఖల ఉన్నతాధికారులు హైకోర్టులో మొట్టికాయలు వేయించుకోవడం అందరికీ తెలుసు.
తాజాగా ఎన్నికల సమయంలో కూడా వైసీపి నేతల కనుసన్నలలో పనిచేస్తున్న పలువురు పోలీస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమీషన్ వేటు వేసింది.
చివరికి రాష్ట్ర పోలీస్ బాస్ డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డిని కూడా పక్కకు తప్పించేసి ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాని నియమించింది. దీనిని ఆయన అవమానంగా భావించారో లేదో తెలీదు కానీ ఆ హోదాలో ఉన్న వ్యక్తి ఈవిదంగా వ్యవహరించడం, అందుకు వేటు పడటం ఖచ్చితంగా చాలా అవమానకరమే కదా?
అయితే ఇది ఇక్కడితో ఆగలేదు. పోలింగ్ తర్వాత కూడా ఆంధ్రాలో అల్లర్లు, దాడులు, విధ్వంసం కొనసాగుతుండటంతో కొత్తగా డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) జవహార్ రెడ్డిని ఇద్దరినీ కేంద్ర ఎన్నికల కమీషన్ ఢిల్లీకి వచ్చి సంజాయిషీ ఇమ్మనమని ఆదేశించింది.
ముఖ్యమంత్రి తర్వాత ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తి సిఎస్ కాగా, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యత డిజిపిపై ఉంటుంది. అంత పెద్ద హోదాలో ఉన్నవారు కేంద్ర ఎన్నికల కమీషన్ ముందు చేతులు కట్టుకొని సంజాయిషీ ఇచ్చుకోవలసి రావడం అవమానమే కదా? ఇలాంటి అవమానం ఎందువల్ల కలిగింది?వారికే తెలుసు.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంతకాలం వారిని ఇష్టం వచ్చిన్నట్లు ఉపయోగించుకున్న వైసీపి నేతలు, మంత్రులు అందరూ కూడా ఇప్పుడు వారినే నిందిస్తున్నారు.
పోలీస్ శాఖ వైఫల్యం చెందిందని, పోలీస్ అధికారులు అప్పుడే టిడిపి తొత్తుల్లా మారిపోయారని ఆరోపిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. వైసీపి నేతలు పదవీ, అధికారంలో నుంచి ఇంకా దిగిపోకముందే పోలీసులను తప్పు పడుతున్నారు. ఈసడించుకుంటున్నారు.
అంటే రాజకీయ నాయకులతో పోలీస్ ఉన్నతాధికారులు అంటకాగితే ఏదో ఓ రోజు వారి పరిస్థితి ఇలాగే మారుతుందని ఇవన్నీ స్పష్టం చేస్తున్నాయి.
కనుక ఇప్పటికైనా పోలీస్ అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు తమ ఉద్యోగ ధర్మానికి మాత్రమే కట్టుబడి పని చేసుకుపోతే మంచిది. దాని వలన తరచూ బదిలీలు కావచ్చు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ నిలిచిపోవచ్చు కానీ ఇలా ఎవరి ముందో చేతులు కట్టుకొని నిలబడి సంజాయిషీలు ఇచ్చుకోవలసిన దుస్థితి ఏర్పడదు. జైలుకి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు.




