ఏపీకి ‘ప్రత్యేక హోదా’ సాధనే లక్ష్యంగా మీడియా వేదికగా వ్యాఖ్యలు చేసే నటుడు శివాజీ, కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ విచ్చేసి పున్నమి ఘాట్ వద్ద పుష్కర స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా పిండ ప్రధానం చేసిన శివాజీ, అనంతరం మీడియాతో వ్యాఖ్యానించారు. పుష్కర ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చిన శివాజీ, వైసీపీ నేతలు చేస్తున్న కుల పరమైన వ్యాఖ్యలను ఖండించారు.
‘తానూ ఏ ఒక్క కులం గురించో పోరాడడం లేదని, ప్రత్యేక హోదా తప్ప మరో లక్ష్యం తనకు లేదని, ఏపీ ప్రజల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నానని, పాలక, ప్రతిపక్షాలు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని’ అన్నారు. ‘ఏపీలో పుట్టాం… ఏపీ రుణం తీర్చుకుంటాం…’ అంటూ నినదించిన శివాజీ, ఎట్టి పరిస్థితులలోనూ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించవద్దని సూచనలు చేసారు.
పుష్కర స్నానం వేళ… ఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక హోదా’ రావాలని ఆశిస్తూ ప్రాణాలు అర్పించిన వారికి పిండ ప్రధానం చేసానని, వీరితో పాటు ‘ప్రత్యేక హోదా’ను ఇవ్వకుండా అడ్డుపడుతున్న వారికి కూడా పిండ ప్రధానాలు చేసానని… పరోక్షంగా బిజెపిపై తీవ్ర మండిపాటు వ్యాఖ్యలను చేసారు. హోదా కోసం పోరాడుతున్న తనపై విమర్శలు చేసే స్థాయి వారికి లేదంటూ ప్రధానంగా కేంద్ర సర్కార్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శల వర్షం కురిపించారు.



