తాము ఎలాగూ ఎన్నికలలో పోటీ చేసి గెలిచేది లేదుగనుక పార్టీ హై కమాండ్ ను ప్రసన్నం చేసుకుంటే నాలుగు కాంట్రాక్టులు, నామినేటెడ్ పదవులు వస్తే చాలు అనుకుంటున్నారేమో రాష్ట్ర బీజేపీ నాయకులు. వారు చేసే వ్యాఖ్యలు సత్యదూరంగానూ ప్రజలకు ఆగ్రహం తెప్పించేవిగానూ ఉంటున్నాయి.
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కాసేపటి క్రితం ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కేంద్రం ఇవ్వాల్సిందంతా ఇచ్చేసింది. మేం ఇంకేం బాకీ ఉన్నామో చంద్రబాబే చెప్పాలి అన్నారు. ముఖ్యమంత్రి దాదాపుగా 29 సార్లు ఢిల్లీ వెళ్లి ఇచ్చిన వినతిపత్రాలలో ఏమున్నాయో కూడా బీజేపీ వారు చదవలేదా? ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది?
కనీసం 2014 బీజేపీ మేనిఫెస్టో పక్కన పెట్టుకుని చూస్తే ఏమి ఇచ్చారో ఏమి ఇవ్వలేదో తెలీదా ఈ నాయకులకు? మిత్రపక్షంగా ఉంటూ మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు సోము వీర్రాజు. ఇవి ఆరోపణలు మాత్రమే అయితే ఇంక వారు పట్టించుకోవాల్సింది ఏముంది ప్రజలే నిర్ణయించుకుంటారు కదా ఎవరిదీ తప్పో ఎవరిది ఆరోపణో?
మరోవైపు రాజీనామాల అంశం టీడీపీ, వైసీపీ డ్రామా అని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రణాళికను టీడీపీ ఏమేర అమలుచేసిందో పవన్ కళ్యాణ్ ను అడుగుతా అని ఆయన చెప్పుకొచ్చారు. నిజమే కేంద్రం అడుగడుగునా మోసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వాగ్ధానాలను ఎలా అమలు చేస్తుంది? రాష్ట్రం చేతిలో నిధులు ఉంటే వీరిని అడగాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి వితండవాదనలు చేస్తే ప్రజలే బుద్ది చెబుతారు.



