బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాటలు చిత్రంగా ఉంటాయి. ఆయన ఏమి అనుకుని మాట్లాడతారో తెలీదుగానీ నిజానికి ఆయన చేసే వితండవాదం బీజేపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తాయి, చేస్తున్నాయి. అమరావతికి ప్రధాని వచ్చి కేవలం మట్టినీరుని ఇవ్వడం కూడా ఆయన సమర్థిస్తున్నారు.
అమరావతి శంకుస్థాపన కోసం వివిధ ప్రాంతాల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు పవిత్ర మట్టి, నీరు తెప్పించారని.. ఆయన సెంటిమెంట్ గౌరవించి మోదీ పవిత్ర జలం, పార్లమెంటు నుంచి మట్టి తీసుకువస్తే తప్పు కనిపించిందా? అని ప్రశ్నించారు. నిజానికి మట్టీ నీరు తేవడం ఎవరూ తప్పు పట్టలేదు. అయితే కేవలం మట్టీ నీరు మాత్రమే తేవడం తప్పు పడుతున్నారు.
ఢిల్లీ స్థాయి రాజధాని అని వాగ్దానం చేసిన ప్రధాని ఇప్పటివరకు అమరావతికి 1500 కోట్లు మాత్రమే ఇవ్వడాన్ని విమర్శిస్తున్నారు అంతా. విజయవాడ, గుంటూరు భూగర్భ డ్రైనేజీ కోసం ఇచ్చిన 1000 కోట్లు కూడా రాజధాని లెక్కలలో కలపడం అన్యాయం అంటున్నారు. ఇవన్నీ వదిలేసి కొంపతీసి మట్టీ నీరు ఇచ్చినందుకు ప్రధానికి రుణపడి ఉండాలని ఆయన కోరుకుంటున్నారా?



