సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె, ప్రస్తుతం “విఐపీ 2” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సౌందర్య రజనీకాంత్ కు వ్యక్తిగత జీవితంలో విముక్తి లభించింది. 2010లో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అశ్విన్ రామ్ కుమార్ తో జరిగిన వివాహం నాలుగేళ్ల పాటు సాఫీగా సాగింది. వారి దాంపత్యానికి గుర్తుగా 2015లో వారికి ఒక బిడ్డ పుట్టగా, బాబు తొలి పుట్టిన రోజు వేడుక సందర్భంగా దంపతుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.
ఇక అక్కడ నుండి పెరిగి పెరిగి వారిద్దరి మధ్య దూరం మరింత పెంచింది. దీంతో సౌందర్య భర్తకు దూరంగా పుట్టింటికి వచ్చేసింది. వారి సమస్యలు పరిష్కరించేందుకు రజనీకాంత్ తో సహా, ఇతర కుటుంబ సభ్యులు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో గత డిసెంబర్ లో ఆ దంపతులిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుని, చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకులకు పిటీషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో సుదీర్ఘ విచారణ అనంతరం వారిద్దరూ కలిసేది లేదని నిర్ధారించిన న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. దీంతో సౌందర్య రజనీకాంత్, అశ్విన్ రామ్ కుమార్ చట్టప్రకారం విడిపోయారు. దీంతో తన వ్యక్తిగత జీవితంలో సౌందర్యకు ఊరట లభించినట్లయ్యింది. అంతకుముందు ‘కొచ్చాడియన్’తో విఫలమైన సౌందర్య, ఈ సారి సూపర్ హిట్ మూవీ ‘విఐపీ’కి సీక్వెల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



