వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు తాడేపల్లి వెళితే జగనన్న వాయించేస్తుంటాడు. ఆయన బాధ భరించలేక గడప గడపకి వెళ్తే జనం వాయించేస్తుంటారు. వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది.
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటి దురుసు గురించి ఇదివరకు చాలాసార్లు మీడియా వార్తలలో వచ్చాయి. మళ్ళీ నేడు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని నెల్లిపర్తి గ్రామంలో ఈరోజు గడప గడపకి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఓ అంగన్వాడీ కార్యకర్తతో ఆయన అలాగే దురుసుగా వ్యవహరించారు.
ఆమె తనను అన్యాయంగా ఉద్యోగంలో నుంచి తొలగించరంటూ తన సమస్యలు చెప్పుకొంటుంటే ఆయన సహనం కోల్పోయి “నేను మీ సమస్యలను పరిష్కరించడానికి వచ్చాను కానీ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడితే వినడానికి రాలేదు. నీ దిక్కున్న చోట చెప్పుకో…” అంటూ ఆమెను చీత్కరించుకొంటూ వెళ్ళిపోయారు.
దాంతో ఆ మహిళ కూడా ఆగ్రహంతో “సభాపతిగా పనిచేస్తున్నవాడికి మహిళలతో ఎలా గౌరవంగా ప్రవర్తించాలో తెలీదా?నేను నా సమస్యను చెప్పుకొంటుంటే దిక్కున్న చోట చెప్పుకొమంటాడా?మా సమస్యలు పరిష్కరించడానికే వచ్చానని చెప్పుకొన్నారుగా? మరెందుకు వినకుండా చీదరించుకొని వెళ్లిపోతున్నారు?
సభాపతిగా వ్యవహరిస్తున్న వ్యక్తి ప్రజలతో ఇలాగే ప్రవర్తిస్తాడా? ఈ వీడియోను జగనన్నకు చూస్తే ఆయనే మీకు తగిన విదంగా బుద్ధి చెపుతారు. అయినా అంగన్వాడీ ఉద్యోగం పోతే నేనేమీ బ్రతకలేనన్నుకొన్నారా?”అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే తమ్మినేని పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు.
ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎంపీ అయోధ్యా రామిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే ముస్తాఫాలకు ప్రజల నుంచి ఇలాగే చేదు అనుభవం ఎదురైంది. వారు ముగ్గురూ కలిసి నగరంలో జున్ను షాహీద్ నగర్లో పీకలవాగును పరిశీలించడానికి వెళ్ళారు.
అక్కడ స్థానికులు వారిని చుట్టుముట్టి “నాలుగేళ్ళుగా అండర్ గ్రౌండ్ కాలువ నిర్మించమని మేము అడుగుతూనే ఉన్నాము. మీరు నిర్మిస్తామని చెపుతూనే ఉన్నారు. ఇంకా ఎప్పుడు నిర్మిస్తారు?” అంటూ వారిని గట్టిగా నిలదీశారు.
“దీనిని పరిశీలించడానికే కదా మేము వచ్చాము.. కాస్త ఓపిక పట్టండి…” అంటూ ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ వారికి సర్దిచెప్పబోయారు. అయితే వారు ఆగ్రహం చల్లార్చలేకపోయారు.
వారిలో ఓ యువకుడు రోడ్డు పక్కన పారుతున్న మురుగు కాలువలో దిగి నిలబడి “చూస్తున్నారా? నడుములోతు మురుగు నీరు పారుతోందిక్కడ. పిల్లలు, జంతువులు దీనిలో పడి చనిపోయే వరకు పట్టించుకోరా?ఇంకా ఎప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తారు? మళ్ళీ ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి,” అంటూ గట్టిగా నిలదీశాడు.
అతనికి నచ్చజెప్పి బయటకు రప్పించేందుకు వారు ముగ్గురూ, వారితో వచ్చిన పోలీస్ అధికారులు కూడా ప్రయత్నించారు. కానీ కాలువ ఎప్పుడు నిర్మిస్తారో చెపితే తప్ప బయటకు రానని మొండిపట్టు పడుతుండటం, పక్కనే మీడియా ఈ గొడవను తమ కెమెరాలలో చిత్రీకరిస్తుండటంతో వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ప్రజల నుంచి ఇంత ఒత్తిడి వస్తున్నా మంత్రులు, ఎమ్మేల్యేలు పనులు చేయించలేక, వారి సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు. దాంతో ప్రజల ఛీత్కారాలు భరించలేక గడప గడపకి వెళ్ళేందుకు భయపడుతున్నారు. వెళితే జనాలు ఇదిగో ఇలా నిలదీస్తున్నారు. వెళ్ళకపోతే జగనన్న నిలదీస్తాడు.. వామ్మో! ఇదెక్కడ సమస్య!



