ప్రపంచం మొత్తం ‘సెల్ఫీ’మయం అయిపోతుంది. ఈ సెల్ఫీ క్రేజ్ కోసం ప్రాణాలు తీసుకుంటున్న జనాలు ఉన్నారు. అయితే రాజకీయ ప్రచారానికి కూడా ఈ ‘సెల్ఫీ’ పిచ్చి అంటుకుంది. కేరళ ఎన్నికలలో భాగంగా అధికార పార్టీ బిజెపి తరపున బరిలోకి దిగిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్, తన రాజకీయ ప్రచారానికి ఈ ‘సెల్ఫీ’లనే ఉపయోగించుకుంటున్నారు.
ఒక క్రికెటర్ గా తనకున్న క్రేజ్ తో సామాన్య ప్రజలతో సెల్ఫీ ఫోటోలు దిగుతూ వారిలో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు శ్రీశాంత్. చాలా అరుదుగా దొరికే ఇలాంటి సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగేందుకు ప్రజలు కూడా ఆసక్తి కనపరుస్తూ శ్రీశాంత్ చుట్టూ గుమిగూడుతున్నారు. అయితే ఈ సెల్ఫీలు బిజెపి దోహదం చేస్తాయా? శ్రీశాంత్ కు మరింత క్రేజ్ తెచ్చిపెడతాయా? అంటే తెల్లమొహం వేయాల్సిందే.
ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో పెట్టుకుని, లైక్ లు, షేర్లు కొట్టించుకోవడానికి తప్ప, ఇలాంటి సెల్ఫీ ఫోటోలు ఓట్లు తెచ్చిపెడతాయని భావిస్తే బహుశా అంతకుమించిన అమాయకత్వం మరొకటి ఉండదని చెప్పవచ్చు. రాజకీయాల్లో అరంగ్రేటం చేసిన శ్రీశాంత్ కు బహుశా ఈ విషయాలన్ని అవగతం కావాలంటే మరికొన్ని సంవత్సరాలు పట్టవచ్చు.



