వన్డే ప్రపంచ కప్లో సత్తా చాటిన మహిళా క్రికెటర్ శ్రీచరణి నేడు సిఎం చంద్రబాబు నాయుడుని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమెకు రూ.2.5 కోట్ల నగదు బహుమతి, కడపలో నివాస స్థలంతో పాటు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నట్లు సిఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇలాగే ఉత్సాహంగా ఆడుతూ మరింత మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.
తాను ఆంధ్రా క్రికెట్ క్రికెట్ అసోసియేషన్లో చేరి శిక్షణ పొందానని, తల్లి తండ్రులు, కోచ్ ప్రోత్సాహం ఉండటం వలన ఈ స్థాయికి ఎదిగానని శ్రీచరణి అన్నారు.
విద్యార్ధులు బాగా చదివి పరీక్షలు వ్రాస్తే మంచి ర్యాంకులు, మార్కులు వస్తాయి. సినిమాలు సూపర్ హిట్ అయితే భారీగా కలెక్షన్స్ వస్తాయి. నటీనటులకు అవార్డులు లభిస్తాయి. క్రీడలలో సత్తా చాటితే క్రీడాకారులకు అవార్డులు లభిస్తాయి. పేరుప్రతిష్టలు లభిస్తాయి.
కానీ విజయం సాధించేవరకు ఒంటరి పోరాటాలు తప్పవు. అప్పుడు ఎవరూ గుర్తించరు. వెన్నుతట్టి ప్రోత్సహించరు. కొంత మందికి కనీసం ఆహారం, కనీస సదుపాయాలు కూడా ఉండవు.
ఆ పరిస్థితులలోనే కొంతమంది ఒంటరిగా, చాలా ధైర్యంగా ముందుకు సాగుతూ విజయం సాధిస్తుంటారు. కనుక విజేతలు తాము ఎంచుకున్న రంగంలో కంటే ముందుగా జీవితంలో విజయం సాదించారని చెప్పవచ్చు.
ఎవరైనా విజయం సాధించిన తర్వాతే ప్రపంచం వారిని గుర్తించడం ప్రారంభిస్తుంది. సమాజం జేజేలు పలుకుతుంది. విజయం సాధించిన తర్వాతే ప్రభుత్వాలు కూడా గుర్తిస్తుంటాయి. ఇది చాలా సహజమైన లోకరీతి. కనుక శ్రీ చరిణికి ఇలాంటి అద్భుతమైన పురస్కారాలు లభించాయి.
కానీ విజయం సాధించిన వ్యక్తిని అభినందించి అవార్డులు, భారీగా నగదు బహుమతులు, ప్రభుత్వోద్యోగాలు, ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కంటే, వారు ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడే ప్రభుత్వాలు గుర్తించి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తే వారు మరింతగా రాణించగలరు.
నిజానికి విజయం సాధించిన తర్వాత వారికి ప్రభుత్వ సహాయ సహకారాలు అంతగా అవసరం ఉండదు. అదే… పాఠాశాల స్థాయిలోనే వారి ప్రతిభని గుర్తించి, వెలికితీసి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తే అత్యుత్తమ క్రీడాకారులు తయారవుతారు. రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తెస్తారు కూడా.







