పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయాడు…పార్టీని నిలబెట్టుకుంటాడా…అన్న మాదిరి ఎదో ఒక పార్టీలో విలీనం చేసేస్తాడా…కార్లను మార్చినట్టు పెళ్లాలను మారుస్తాడు…ప్యాకేజీ కు పార్టీని అమ్మేసుకుంటున్నాడు…తన సామజిక వర్గ ఓటర్లను బాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాడు…దత్తపుత్రుడు అంటూ వాగే ప్రతి వైసీపీ నేత నోరు మూసే సమయం అతి దగ్గరలోనే ఉందంటూ జనసైనికులు వైకాపా నాయకులకు కౌంటర్ వేస్తున్నారు.
పిఠాపురం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలనీ ఆశ పడిన వర్మ పొత్తు ధర్మానికి కట్టుబడి ఆ స్థానాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసారు. 2014 లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేసి సుమారు 90 వేల ఓట్లు పైన సాధించి ఎమ్మెల్యే గా గెలుపొందిన వర్మ 2019 లో టీడీపీ – జనసేన విడివిడిగా పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చీలి వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబు మీద ఓటమి చెందారు.
టీడీపీ+జనసేనకు వచ్చిన ఓట్లు 96 వేలు కాగా వైసీపీ కి పోలైన ఓట్లు సుమారు 83 వేలు. కేవలం ఈ గణాంకాల ఆధారంగా చూసుకున్న టీడీపీ + జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయమైనట్లే. ఇప్పుడు దీనికి తోడు రాష్ట్రంలో వైసీపీ పార్టీకి వీస్తున్న ఎదురుగాలి ఈ కూటమి అభ్యర్థికి అదనపు బలమనే చెప్పాలి. దానికి తోడు గత ఎన్నికలలో పవన్ ఓడిపోయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పై ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఇది ప్రజలలో పవన్ పట్ల సింపతీని క్రియేట్ చేసింది.
అదీ కాకుండా ఓడిపోయాడు..,ప్యాకేజీ స్టార్..,పెళ్లిళ్ల కళ్యాణ్..,అంటూ ముఖ్యమంత్రి జగన్ పవన్ పై పదేపదే చేసే విమర్శలతో పవన్ పట్ల ప్రజలలో ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. ఒక స్టార్ హీరో అయ్యినప్పటికీ వైసీపీ చేసిన ఎన్నో అవమానాలను భరించి ఓడించిన ప్రజల కోసం తడబడకుండా నిలబడిన తీరుకు, రాష్ట్ర సంక్షేమం కోసం వేసిన ముందడుగుకు ఒక వర్గం ప్రజలలో పవన్ పై గౌరవం పెరిగింది.
ఇలా ఏ కోణంలో చూసినా ఈసారి పవన్ కు అన్ని అనుకూల సంకేతాలే కనపడుతున్నాయి. ఇటువంటి తరుణంలో పవన్ గెలుపు అసాధ్యం అంటూ ‘ఎత్తిన ప్రతి వైసీపీ చెయ్యి దిగాలి… వాగిన ప్రతి నోరు మూయాలి’ అనే నినాదంతో పిఠాపురం లో టీడీపీ+జనసేన పూర్తి స్థాయి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే నిన్న మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ నేత వర్మ, సుజయ్ కృష్ణ జనసేనాని పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఎన్నికల వ్యూహం మీద చర్చలు జరిపారు.
పొత్తులో భాగంగా సీటు కోల్పోయిన వర్మ జనసేనకు మద్దతుగా నిలబడతారా..? అంటూ అనుమానంగా చూసిన ప్రతి జనసైనికుడికి, పవన్ అభిమానులకు తన మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పారు వర్మ. అలాగే ఎలా అయినా ఈ రెండు పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఈసారి కూడా పవన్ ను అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదు అనే వైసీపీ వ్యూహాన్ని వర్మ బద్దలుకొట్టారనే చెప్పాలి.
అసలు పవన్ గెలవకూడదు అని ఆశపడుతున్న వైసీపీ కి పవన్ ని భారీ మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత నాది అంటూ వర్మ చేసిన కామెంట్స్ తో రెండు పార్టీల పొత్తుని నాశనం చేయాలి అని చూసిన ప్రతి నోరు మూసుకుంది. ఇలా మూడు పార్టీల నేతలు భేషజాలకు పోకుండా ఒకరినొకరు సమన్వయ పరచుకుంటూ ముందుకెళ్తే ఇన్నాళ్లు వారి పార్టీల అధినేతలను తమ మాటలతో అవమానిస్తున్న ప్రతి నోరు మూసే రోజు త్వరలోనే ఉంటుందనేది ప్రస్తుత అంచనా.





