రానురానూ రాజకీయ నాయకుల తీరు కూడా మాస్ సినిమా డైలాగ్ లని తలపించే విధంగా మారిపోయాయి అంటూ వాపోతున్నారు సామాన్య ప్రజలు. అధినాకులను ప్రసన్నం చేసుకోవడానికి లేదా పదవులను కాపాడుకోవడానికి బూతు పురాణమే శరణ్యంగా మారిపోయిందని అందుకే రణాన్ని తలపించేలా నాయకులు వ్యవహరిస్తున్నారంటూ పబ్లిక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటపై, వారిచ్చిన డిక్లరేషన్ పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదే సందర్భంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై బూతులతో మంత్రి తలసాని విరుచుకుపడ్డారు.
రేవంత్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. వాడున్నదే ఇంత, వాడు పొట్టోడు, వాడి నోటికి బట్టనే లేదు, మంత్రులు, ఎమ్మెల్యేలు అని చూడకుండా నా కొడుకు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నాడు. పిసికితే ప్రాణం పోతదంటూ రేవంత్ పై ఓ రేంజ్ లో విమర్శలు చేశారు తలసాని.
తలసాని వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తలసానికి చిన్నప్పటి నుండి పెండ పిసికే అలవాటు ఉందని, అందుకే అయిన పిసుకుతా అంటున్నారని, చిన్నప్పటి నుండి దున్నపోతులతో సహవాసం చేసి ఆయనని ఆయన దున్నపోతుగా అనుకుంటున్నారని రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అంతేకాకుండా తలసాని పాన్ పరాగ్ లు నమిలే అలవాటు మానుకుంటే మంచిదని, ప్రజాప్రతినిధులు గా ఉన్నప్పుడు యువతకు ఆదర్శవంతంగా ఉండేలా వ్యవహరించాలని రేవంత్ అన్నారు. అరటిపండ్ల బండి దగ్గర మేక నమిలినట్లు నమిలే తలసాని కూడా తన గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదని రేవంత్ అన్నారు.
నిజంగా తలసానికి అంతగా పిసకాలని కోరిక ఉంటే డేట్,టైం, ప్లేస్ చెప్పాలని.. తానే స్వయంగా రమ్మన్న చోటుకి వెళ్తానని, ఏమి పిసుకుతారో నేనూ చూస్తా అంటూ రేవంత్ తనదైన శైలిలో ఘాటు కౌంటర్లు ఇచ్చారు. తాను ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడినని, కేసీఆర్ చెప్పులు మోసినా.. కేటీఆర్ సంక నాకినా తన స్థాయికి తలసాని ఎప్పటికీ రాలేరని రేవంత్ విమర్శించారు. ఇంకా మోజు ఉంటే తలసాని ఎక్కడి రమ్మంటే అక్కడి వెళ్తానని రేవంత్ అన్నారు.
ఎవరు ఏం పిసుక్కున్నా.. ప్రజలను మాత్రం వీళ్ళ భాష తో పిసికేస్తున్నారని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.



