గత వారం రోజులుగా టీడీపీ వైకాపా ఎంపీలు పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రెండు పార్టీల వారు దాదాపుగా నాలుగు ఏళ్ళు కాలయాపన చేసి ఎన్నికల వేళ మేల్కొన్నారు. అయితే దీనిలో కూడా ఎవరికీ ఉండాల్సిన రాజకీయ వ్యూహం వారికి ఉంది.
ఎంతో కొంత చెయ్యకపోతారా అని ఇప్పటిదాకా ఆశించిన టీడీపీ తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తో పూర్తిగా నిరుత్సాహపడింది. బీజేపీకి కొమ్ము కాస్తే తాము కూడా మునగడం ఖాయం అనుకుని ఇప్పుడు పోరాటం మొదలుపెట్టింది. బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలని డిసైడ్ అయ్యి ముందుకు సాగుతుంది.
అయితే 2019లో బీజేపీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నందున ఎన్డీయే నుండి బయటకు రావడానికి తిప్పలు పడుతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా కూడా తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతుంది. అవసరమైతే బీజేపీతో జత కట్టాలని అనుకున్నట్టుగా కనిపిస్తుంది ఆ పార్టీ.
ప్రజలకోసం, మీడియా కోసం నామమాత్రంగా నిరసనలు తెలుపుతుంది. మీడియా ముఖంగా కూడా బీజేపీని నిందించకుండా టీడీపీనే దోషిగా చూపించే ప్రయత్నం చేస్తుంది. పనిలో పనిగా విజయసాయిరెడ్డి ద్వారా బీజేపీ అధినాయకత్వంతో టచ్ లో ఉంటుంది. దీనితో బీజేపీ వైకాపా పొత్తుపై ఉన్న ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. అయితే ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా ఈ పార్టీల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చూడాలి.



