ఇంతకాలం జగన్, వైసీపీ నేతలు ఎంతగా రెచ్చగొడుతున్నప్పటికీ, సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సంయమనం పాటిస్తున్నారు. తమ మంత్రులు, పార్టీ నేతలను కట్టడి చేసి ఉంచుతున్నారు. అందుకే మీడియా ‘వైసీపీ హోరు’ ఎక్కువగా వినిపిస్తుంటుంది తప్ప టీడీపి, జనసేన నేతల గొంతులు పెద్దగా వినబడవు.
కానీ తమ సంయమనం వైసీపీకి అలుసుగా తీసుకొని రెచ్చిపోతున్నా తాము మౌనంగా ఉండిపోతుంటే వారి విమర్శలు, ఆరోపణలు అంగీకరిస్తున్నట్లే అవుతోందని నేతల వాదనలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంగీకరించినట్లే ఉన్నారు.
కనుక వైసీపీ విమర్శలకు పరిధి దాటకుండా హుందాగా జవాబు చెప్పాలని, వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండించాలని సూచించారు.
ఈ మాత్రం అవకాశం ఇస్తే టీడీపి నేతలు మాట్లాడటం మొదలుపెడితే ఎలా ఉంటుందో అప్పుడే వైసీపీకి రుచి చూపిస్తున్నారు.
మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు ప్రఖ్యాత అపోలో టైర్స్ కంపెనీని తెచ్చారు. జగన్ సైకిల్ ట్యూబ్ కంపెనీ కూడా తీసుకురాలేకపోయారు. కానీ పెట్టుబడుల కోసం అంటూ విదేశాలలో విహార యాత్రలు చేసి వచ్చారు.
కనీసం ఉన్న పరిశ్రమలను కాపాడుకునే ప్రయత్నం చేయకపోగా తమ అరాచకాలకు భయపడి పారిపోయేలా చేశారు. ఏపీ అభివృద్ధికి, అమరావతి నిర్మాణానికి సహకరిస్తున్న సింగపూర్తో సంబంధాలు చెడగొట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మళ్ళీ వారికి నచ్చేజెప్పి, ఒప్పించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తున్నారు.
ఐదేళ్ళు పాలించినా ఒక్క కంపెనీని కూడా రప్పించలేకపోయిన జగన్, వైసీపీ నేతలు ఇప్పుడు పరిశ్రమలు, పెట్టుబడులు తెస్తున్న సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శించేందుకు అర్హత కోల్పోయారు,” అని అన్నారు.
టీడీపి ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు కూడా ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉంటారు. అయన ధిల్లీలో సహచర ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి మీడియాతో మాట్లాడుతూ, “జగన్ అధికారంలో ఉన్నప్పుడు తన అరాచక పాలనతో పారిశ్రామికవేత్తలు భయపడిపోయేలా చేశారు.
పదవీ అధికారం కోల్పోయినా జగన్ తీరు మారలేదు. నేటికీ పారిశ్రామికవేత్తలు భయపెట్టేందుకు ప్రయత్నిస్తూ రాష్ట్రానికి రాకుండా అడ్డుకునేందుకు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. జగన్ శవరాజకీయాలు, పరామర్శ యాత్రల పేరుతో బలప్రదర్శనలు చేయడం మానుకోవాలి.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రేషన్ బియ్యం యదేచ్చగా కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు రవాణా అవుతుండేది. నిజమా కాదా చెప్పాలి?” అని అన్నారు.
నిజమే కదా? జగన్, వైసీపీ నేతలు ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పగలరా?




