టిడిపి-జనసేనలని దగ్గర చేస్తున్నది ఎవరు?

Pawan Kalyan Chandrababu Naiduజనసేన అధినేత ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి నివాసానికి వెళ్ళి సుమారు 3 గంటలపాటు భేటీ అయ్యారు. కుప్పంలో చంద్రబాబు నాయుడి పర్యటనని అడ్డుకొనేందుకు వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఖండిస్తూ ఆయనకి సంఘీభావం తెలిపేందుకు పవన్‌ కళ్యాణ్‌ వెళ్లారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను ప్రజలకి దూరం చేయడానికే జీవో నంబర్: 1 తెచ్చిందని, కందుకూరు, ఉయ్యూరు ఘటనలు ఖచ్చితం రాజకీయకుట్రగానే భావిస్తున్నామని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇకపై ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని ఇద్దరూ నిర్ణయించారు.

వారి భేటీపై వెంటనే వైసీపీ నేతల విమర్శలు గుప్పించగా, వాటికి టిడిపి నేతలు అంతకంటే ఘాటుగా జవాబులిచ్చారు కూడా. ఈ మూడు పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలు, వాదోపవాదాలను పక్కన పెట్టి చూస్తే, గత ఎన్నికలలో దూరమైన టిడిపి, జనసేనలు మళ్ళీ దగ్గరయ్యేందుకు ఎవరు తోడ్పడుతున్నారు?అని ఆలోచిస్తే వైసీపీ, బిజెపిలే అని చెప్పక తప్పదు.

ADVERTISEMENT

ఏదో విదంగా ఆ రెండు పార్టీలని రాజకీయంగా దెబ్బతీయాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలే వాటిని దగ్గర చేస్తుంటే, జనసేన పట్ల, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం, బిజెపిల వైఖరి కూడా అవి దగ్గరయ్యేందుకు తోడ్పడుతున్నాయని చెప్పక తప్పదు.

ఏపీలో టిడిపికి నానాటికీ ప్రజాధారణ పెరుగుతోందని, పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్రంలో కాపులను ఏకం చేస్తున్నారని గుర్తించిన వైసీపీ ప్రభుత్వం, కందుకూరు, ఉయ్యూరు ఘటనలని సాకుగా చూపుతూ హడావుడిగా జీవో నంబర్: 1 జారీ చేసి వారిరువురూ సభలు, సమావేశాలు నిర్వహించుకోకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. తమ రాజకీయ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుంటే ఏ రాజకీయ పార్టీ కూడా చేతులు ముడుచుకొని కూర్చోదు. టిడిపి, జనసేనలకి అటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కనుకనే పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడు కలిసేలా చేసిందని చెప్పవచ్చు. అదే… వారి సంయుక్త ప్రకటనలో చెప్పారు కూడా.

బిజెపితో కలిసి పనిచేసేందుకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని పవన్‌ కళ్యాణ్‌ ఎన్నిసార్లు అడిగినా రాష్ట్ర బిజెపి పట్టించుకోకపోవడం, ప్రధాని నరేంద్రమోడీతో పవన్‌ కళ్యాణ్‌ భేటీ తర్వాత కూడా రాష్ట్ర బిజెపి నేతల తీరు మారకపోవడం, ఏపీలో ఇంత రాజకీయ, ఆర్ధిక, మౌలిక విధ్వంసం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా వైసీపీ ప్రభుత్వాన్ని వెనకేసుకువస్తున్నట్లు వ్యవహరిస్తుండటం వంటివి పవన్‌ కళ్యాణ్‌ని పునరాలోచించేలా చేసి, టిడిపికి దగ్గర చేశాయని చెప్పవచ్చు. కనుక వైసీపీ, బిజెపిలు చేస్తున్న తప్పుల కారణంగానే టిడిపి, జనసేనలు దగ్గరవుతున్నాయి తప్ప వాటంతట అవి దగ్గరవడం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories