జీవితాంతం కొనసాగే భారతీయ వివాహ బంధం గురించి నేటికీ బంధాలు, భారతీయ కుటుంబ వ్యవస్థ పట్ల నేటికీ పాశ్చాత్య దేశాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతూనే ఉంటుంది.
ప్రపంచం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున ఆ ప్రభావం ప్రతీ సమాజంపై పడుతోంది. దాని వలన సమాజం కూడా నిరంతర మార్పులు చేర్పులకు లోనవుతూనే ఉంది. అయినప్పటికీ, భారతీయ వివాహ బంధం నిలకడగానే ఉండటం చాలా గొప్ప విషయమే.
అయితే భారత్లో కూడా పెరుగుతున్న విడాకులు, వైవాహికేతర సంబంధాలు, సహజీవనం వంటివి భారతీయ సమాజంపై కూడా ఆధునికత ప్రభావానికి లోనవుతున్నట్లు నిరూపిస్తున్నాయి.
ప్రపంచీకరణ, మారుతున్న జీవనశైలి, వ్యక్తిగత స్వేచ్ఛకు పెరుగుతున్న ప్రాధాన్యం, స్త్రీపురుషుల ఆర్ధిక స్వావలంబన, ఆర్ధిక సమస్యలు, ఉద్యోగాల ఒత్తిడి, సినిమాలు, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వంటి అనేక అంశాలు భారతీయ వివాహ బంధాన్ని బలహీనపరుస్తున్నట్లుగా కనిపిస్తోంది.
అనివార్య కారణాల వలన విడిపోయే దంపతుల కంటే చిన్న చిన్న కారణాలకు గొడవపడి విడిపోయే భార్య భర్తల సంఖ్యే ఎక్కువగా ఉంటోందని మానసిక నిపుణులు, న్యాయవాదులు చెపుతున్నారు. అయితే విడాకులు, సహజీవనంతో అవి ఆగకుండా వైవాహికేతర సంబంధాలకు దారి తీయడం, ఆ కారణంగా హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్ళడమే చాలా ఆందోళన కలిగిస్తోంది.
ఒకప్పుడు భారతీయులలో ఇటువంటివి పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తాయని ఆందోళన చెందేవారు. కానీ ఇప్పుడు పరువు కంటే సుఖంగా, ప్రశాంతంగా జీవించడమే ముఖ్యమని భావిస్తున్నందున, ఈ మార్పులకు అలవాటు పడుతున్నారు. కానీ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే, నేటికీ భారతీయ వివాహ బంధం, కుటుంబ వ్యవస్థ బలంగానే ఉండటం. అది బీటలు వారకుండా కాపాడుకోగలిగితే చాలు.




