టిడిపి, జనసేన పార్టీల నేతలు పొత్తులు ఖరారు చేసుకొని, అప్పుడే తొలి సమన్వయ కమిటీ సమావేశం కూడా నిర్వహించుకొన్నారు. తద్వారా రెండు పార్టీల పొత్తుల విషయంలో ఇంకెవరికైనా అపోహలు, అభ్యంతరాలు ఉన్నట్లయితే దీంతో అవి తొలగిపోవాలి. లేదా వారే బయటకు వెళ్ళిపోవలసి ఉంటుంది.
ముఖ్యంగా టిడిపి, జనసేనల పొత్తులపై అటు బీజేపీకి, ఇటు వైసీపికి కూడా పూర్తి స్పష్టత లభించింది గాబట్టి ఆ రెండు పార్టీలు కూడా తదనుగుణంగా తమ వైఖరి, కార్యాచరణను రూపొందించుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ!
ఇక సమన్వయకమిటీ సమావేశంలో నవంబర్ 1వ తేదీన రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పాయి. సమన్వయ కమిటీ సమావేశంలో ఏయే అంశాలపై పోరాడాలనేదానిపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. కనుక ఇదేమీ పెద్ద ఇబ్బందికాకపోవచ్చు.
ఇంతకంటే అతి ముఖ్యమైన విషయం టిడిపి, జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టో. ఇంతవరకు టిడిపి, జనసేనలు వేర్వేరుగా తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పుకొన్నాయి. కానీ ఇప్పుడు రెండు పార్టీలు కలిసి ఏమి చేయబోతున్నాయో చెప్పబోతున్నాయి.
ఉమ్మడి మ్యానిఫెస్టో అంటే రెండు పార్టీల మద్య అధికార పంపిణీ, బాధ్యతలు, విధానాలపై కనీసం అవగాహనకు వచ్చిన్నట్లే భావించవచ్చు. కనుక అన్నిటిపై పూర్తి స్పష్టతతో అవి ప్రజల ముందుకు రాబోతునాయన్న మాట!
ప్రజలు టిడిపి, వైసీపిలను చూసేశారు. కానీ టిడిపి, జనసేనలు కలయికతో ప్రభుత్వం ఏర్పాటు అనే ఈ సరికొత్త ప్రతిపాదన. కనుక ప్రజలు తప్పకుండా దీనికి మొగ్గు చూపవచ్చు. రెండు పార్టీలు ఉమ్మడి మ్యానిఫెస్టో అనే బలమైన పునాది వేసుకొంటున్నాయి. కనుక వాటి ఉమ్మడి మ్యానిఫెస్టో వచ్చే ఎన్నికలలో ‘గేమ్ చేంజర్’ కావచ్చు.




