ప్రతీ ఎన్నికలలో ఏ పార్టీ, కూటమి గెలుస్తుందనే ఉత్కంఠ ఉంటుంది. కానీ ఈసారి ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలలో అది మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నా తప్పనిసరిగా ‘ఈసారి కూటమా… వైసీపియా?’ అనే చర్చించుకుంటున్నారు.
ఎన్నికల ఫలితాల కోసం వైసీపి, టిడిపి, జనసేన, బీజేపీలు ఆతృతగా ఎదురు చూడటం విశేషం కాదు. కానీ ఈసారి సామాన్య ప్రజలు కూడా ఈ ఎన్నికల ఫలితాల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తుండటమే విశేషం. పోలింగ్ ముగిసిన తర్వాత ఈసారి కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతోందనే ‘టాక్’ మండు వేసవిలో చిరుజల్లుల్లా ఉపశమనం కలిగిస్తున్నాయి.
వైసీపి, టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు ఎంత సంతోషం, ఆందోళనగా గడుపుతున్నారో తెలీదు. కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఒక్కో రోజూ ఒక్కో యుగం అన్నట్లు చాలా భారంగా గడుస్తోందని చెపుతున్నారు. ఫలితాల కోసం జూన్ 4వరకు ఎదురుచూడటం చాలా కష్టంగా ఉందని, అసలు ఇంత ఆలస్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టి జగన్ ప్రభుత్వం, పాలన, వైసీపి నేతల ధోరణితో రాష్ట్ర ప్రజలు ఎంతగా విసుగెత్తిపోయారో అర్దం చేసుకోవచ్చు.
జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశించింది కనుక మీడియా, సర్వే సంస్థలన్నీ ఫలితాలను అంచనా వేసి నివేదికలు సిద్దంగా ఉన్నా చేతులు ముడుచుకుని కూర్చోవలసి వస్తోంది. అయితే సోషల్ మీడియాకు ఇటువంటి కట్టుబాట్లు ఏమీ లేవు కనుక కొందరు ప్రముఖులు, రాజకీయ నిపుణులు తమ అంచనాలను వెల్లడిస్తూనే ఉన్నారు.
అటువంటి మరో అంచనా ప్రకారం, ఏపీ శాసనసభ ఎన్నికలలో టిడిపికి 109, జనసేన 10-12, బీజేపీ 3-4 కలిపి 175కి కూటమికి 120-125 వరకు సీట్లు గెలుచుకొని పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అదే అంచనా ప్రకారం వైసీపికి 43-47 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో 25 లోక్సభ సీట్లలో టిడిపి 14, జనసేన 2, బీజేపీ 3, కలిపి మొత్తం 19 సీట్లు గెలుచుకోబోతుండగా, వైసీపి 6 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సదరు సర్వే సంస్థ అంచనా వేసింది.
టిడిపి యువనేత నారా లోకేష్, మొన్న మీడియాతో మాట్లాడుతూ, “ఈసారి మా కూటమి 175కి కనీసం 160 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రాబోతున్నాము. మంగళగిరిలో నేను భారీ మెజార్టీతో గెలువబోతున్నాను. గత ఎన్నికలలో మంగళగిరిలో నేను ఓడిపోయినప్పటికీ, ఇక్కడ గెలవడం కష్టమని నేను మా పార్టీకి పూర్తి పట్టున్న నియోజకవర్గానికి మారి అక్కడి నుంచి పోటీ చేసి సులువుగా గెలిచేయాలనుకోలేదు. నేను ఎక్కడ ఓడిపోయానో అక్కడి నుంచే పోటీ చేసి గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని అనుకున్నాను,” అని అన్నారు.
సర్వేలు కూడా ఇదే చెపుతున్నాయి. కుప్పంలో చంద్రబాబు నాయుడుని, మంగళగిరిలో నారా లోకేష్ని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించి వారి ముగ్గురికీ రాజకీయ సమాధి కట్టాలని జగన్ ఎంతగా తహతహలాడినప్పటికీ, వారు ముగ్గురూ భారీ మెజార్టీతో ఎన్నికలలో గెలవబోతున్నారని సర్వేలన్నీ సూచిస్తున్నాయి.
మంత్రులు రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాద్, ఎంపీలుగా పోటీ చేసిన అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి పలువురు ఈసారి ఘోర పరాజయం పొందబోతున్నారని సర్వేలన్నీ సూచిస్తున్నాయి.
2019లో భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపి, 2024లో జరిగిన రెండో ఎన్నికలోనే ఘోరంగా ఓడిపోతే, జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నట్లు జూన్ 4న యావత్ దేశ ప్రజలు ఈ ఓటమిని చూసి తప్పకుండా ఆశ్చర్యపోతారు.




