నారా లోకేష్ పాదయాత్రలో నేడు మరో మైలురాయి అధిగమించారు. నేడు 31వ రోజు యువగళం పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో నిండ్రగుంట వద్ద 400 కిమీ మైలురాయిని అధిగమించారు. దీనికి గుర్తుగా నారా లోకేష్ నిండ్రగుంట గ్రామంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తన విజయయాత్రలో తీపిగుర్తుగా నిలిచిన నిండ్రగుంట గ్రామంలో తాము అధికారంలోకి వచ్చిన 100 రోజులలోగా 10 పడకల హాస్పిటల్ కట్టిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.
ఈరోజు ఈర్రంగాలపల్లిలో కాలేజీ యువతీ యువకులతో ముఖాముఖీ సమావేశమయ్యి వారి సమస్యలని అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా, శరణ్యా అనే ఓ ఇంజనీరింగ్ విద్యార్ధిని, ఫీజ్ రీఇంబర్స్మెంట్, బస్ పాసుల గురించి అడిగిన ప్రశ్నకి నారా లోకేష్ సమాధానం చెపుతూ, “జగన్ ప్రభుత్వం ఈ ఫీజ్ రీఇంబర్స్మెంట్ని పూర్తిగా పడుకోబెట్టేసింది. కాలేజీలో మీరు రూ.38-39 వేలు వరకు ఫీజ్ కట్టాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో మీ అకౌంట్లో ఓ పదివేలు వేసేసి మీ దారి మీరు చూసుకోండని చేతులు దులిపేసుకొంది. ఆ లెక్కన ఇంజనీరింగ్ విద్యార్థులపై నాలుగేళ్ళకి కలిపి లక్ష రూపాయలపైనే భారం పడుతోంది. ఇక హాల్ టికెట్స్ కావాలన్నా, మార్క్ లిస్ట్ అడిగినా ముందు ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు బెదిరిస్తున్నాయి. ఈ విద్యాదీవెన, వసతి దీవెన అనేవి రెండు పనికిరాని పధకాలు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసి ఏటా మీ ఫీజులని ప్రభుత్వమే నేరుగా మీ కాలేజీలకి చెల్లిస్తుందని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు.
“విద్యార్థులకి ఉచితంగా ప్రయాణించేందుకు బస్ పాసులు ఇవ్వాలని చాలా మంచి సూచన చేశావు. దీనిని మా పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టించి అధికారంలోకి రాగానే అమలుచేస్తాము. ఫీజుల భారం, ప్రయాణ భారం లేకపోతే మీ తల్లితండ్రులు కూడా మిమ్మల్ని సంతోషంగా కాలేజీలకి పంపిస్తారు అప్పుడు మీరు హాయిగా చదువుకోవచ్చు,” అని నారా లోకేష్ చెప్పినప్పుడు విద్యార్థులు సంతోషంతో ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతూ హర్షధ్వనాలు చేశారు.
అయితే నష్టాలలో అడుస్తున్న ఆర్టీసీకి ఇది భారం కాకుండా చూసేందుకు నారా లోకేష్ తన ఆలోచనని వారితో పంచుకొన్నారు. “జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నర సంవత్సరాలలో మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్యులకు బస్సు సౌకర్యాన్ని దూరం చేసింది. ఆర్టీసీ అంటేనే సామాన్యుల బస్సు. మారుమూల ప్రాంతాలని సమీపంలోని పట్టణాలతో అనుసంధానం చేసేందుకే ఆర్టీసీ బస్సులని వేస్తారు. కానీ జగన్ ప్రభుత్వం ఇంత చిన్న విషయం తెలుసుకోకుండా, ఆర్టీసీ చార్జీలని మూడుసార్లు పెంచేసి సామాన్యులకు ఆర్టీసీని దూరం చేసింది. అయితే ప్రజలపై అదనపు భారం వేయకుండా, ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా ఉంచాలంటే దానికి ఒకటే మార్గం. డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నును తగ్గించడమే. తద్వారా ఆర్టీసీ ఛార్జీలు తగ్గినా ఆర్టీసీ నష్టపోదు. ప్రజలపై భారం పడకుండా చేయవచ్చు,” అని నారా లోకేష్ వివరించినప్పుడు విద్యార్థులు హర్షధ్వానాలు చేశారు.



